వైఎస్సార్‌ సీపీ బంద్‌కు మద్దతు తెలిపేందుకు సిద్ధం

30 Jul, 2016 23:56 IST|Sakshi

 

వైఎస్సార్‌ సీపీ బంద్‌కు మద్దతు తెలిపేందుకు సిద్ధం 
జెడ్పీ చైర్మన్‌ బాపిరాజు 
ఏలూరు (మెట్రో) : ప్రజలకు అవసరమైన ప్రత్యేక హోదా విషయంలో మంగళవారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించే బంద్‌కు మద్దతును తెలిపేందుకూ సిద్ధమేనని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ముళ్లపూడి బాపిరాజు చెప్పారు. స్థానిక జెడ్పీ సమావేశ మందిరంలో శనివారం  విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేంద్రం ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని చెప్పిన నేపథ్యంలో మంగళవారం వైఎస్సార్‌ సీపీ ఇచ్చిన బంద్‌కు రాష్ట్ర ప్రజల ప్రయోజనాల దృష్ట్యా తాము పరోక్షంగా మద్దతు ఇచ్చేందుకు సిద్ధమేనని బాపిరాజు చెప్పారు. రాష్ట్ర విభజన సమయంలో యూపీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ఐదు సంవత్సరాలు ప్రత్యేక హోదా కావాలంటే రాష్ట్రానికి చెందిన వెంకయ్యనాయుడు ఐదు సంవత్సరాలు సరిపోదు, పది సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనంటూ పట్టుబట్టారన్నారు. కానీ అధికారంలోకి వచ్చాక బీజేపీ ఈ విధంగా వ్యవహరించడం దుర్మార్గమన్నారు. 14వ ఆర్థిక సంఘం నిధులకూ ప్రత్యేక హోదాకు ముడిపెట్టడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. రాజకీయపరంగా నష్టపోయినప్పటికీ బీజేపీతో పొత్తుపెట్టుకున్నామని, రెండు సంవత్సరాలు గడిచినా ఇంకా కేంద్రంలో మార్పురాకపోవడం దుర్మార్గమన్నారు. టీడీపీ పొత్తుతో గెలిచిన మంత్రులు, ఎంపీలు తక్షణమే కేంద్రంతో మాట్లాడి, పోరాడి ప్రత్యేక హోదా తీసుకురావాల్సిందేనని బాపిరాజు చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తాము రాజీనామాలు చేసేందుకైనా సిద్ధంగానే ఉన్నామని బాపిరాజు తెలిపారు.  
 

మరిన్ని వార్తలు