సకాలంలో సర్వే పూర్తి

29 Sep, 2016 21:58 IST|Sakshi
కాకినాడ సిటీ :
సర్వేయర్లు బాధ్యతతో పనిచేసి సకాలంలో సర్వే పనులను పూర్తి చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.సత్యనారాయణ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌ విధానగౌతమి సమావేశ హాలులో సర్వేయర్లతో భూ సర్వే, పట్టా సబ్‌ డివిజన్‌ అంశాలపై సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ వచ్చిన దరఖాస్తులను రైతులను ఇబ్బంది పెట్టకుండా త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. భూ సర్వే, పట్టా సబ్‌ డివిజన్‌లకు సంబంధించి ఆన్‌లైన్‌లో వచ్చి నిర్ణీత పరిష్కార గడువు దాటిపోయిన దరఖాస్తులను 15 రోజుల్లో పరిష్కరించాలని స్పష్టం చేశారు. తొండంగి, జగ్గంపేట, రాజానగరం, రంగంపేట, అల్లవరం, అమలాపురం, ఉప్పలగుప్తం తదితర మండలాల్లో మార్చి నెల నుంచి దరఖాస్తులు ఎక్కువగా పెండింగ్‌ ఉన్నాయన్నారు. ఎఫ్‌ఎంబీ డిజటలైజేషన్‌కు 20 మంది సర్వేయర్లను నియమించామని వారిని ఎక్కువ దరఖాస్తులు పెండింగ్‌ ఉన్న మండలాలకు పంపి పరిష్కార చర్యలు తీసుకోవాలని సర్వేశాఖ ఏడీకి సూచించారు. సర్వేకు సంబంధించి ఈటీఎస్‌ పరికరాలు వినియోగించడంలో జిల్లా వెనుకబడి ఉందని, సర్వేయర్లు వాటితోనే పనిచేయాలని ఆదేశించారు. మండల సర్వేయర్లు లైసెన్స్‌ సర్వేయర్లను క్షేత్రస్థాయికి తీసుకువెళ్లి శిక్షణ ఇవ్వాలన్నారు. సమీక్షలో సర్వే భూరికార్డుల శాఖ ఏడి నూతనకుమార్, సర్వేయర్లు పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు