గొట్టిపాటి యాక్షన్‌.. కరణం రియాక్షన్‌

14 Jun, 2016 09:17 IST|Sakshi
గొట్టిపాటి యాక్షన్‌.. కరణం రియాక్షన్‌

అద్దంకి సీఐని బదిలీ చేయించిన రవికుమార్
రాత్రికి రాత్రే బదిలీని నిలిపివేయించిన బలరాం
పతాకస్థాయికి టీడీపీ వర్గ విభేదాలు


ఒంగోలు: అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి అద్దంకి సీఐ బేతపూడి ప్రసాద్‌ను ఆదివారం ఉదయానికి బదిలీ చేయించి యాక్షన్‌కు దిగితే.... అదే రోజు సాయంత్రానికే ఆ బదిలీ నిలిపివేయించి కరణం తన రియాక్షన్‌ చూపించారు. అధికార పార్టీలోని ఇరువర్గాల గొడవ అధిష్టానం తలకు చుట్టుకుంది.

వివరాల్లోకి వెళ్తే... అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ ఇటీవలే అధికార పార్టీలో చేరారు.గొట్టిపాటి రాకను కరణం బలరామకృష్ణమూర్తి,ఆయన తనయుడు కరణం వెంకటేష్‌లు వ్యతిరేకించారు. అయినా చంద్రబాబు గొట్టిపాటిని పార్టీలో చేర్చుకున్నారు. అప్పటి నుంచి అద్దంకిలో వర్గవిభేదాలు భగ్గుమన్నాయి. గొట్టిపాటిని కరణం వర్గీయులు అడుగడుగునే అడ్డుకుంటూనే ఉన్నారు. అయితే గొట్టిపాటి చాప కింద నీరులా తన పని చక్కబెట్టుకునే ప్రయత్నానికి దిగారు. ఇందులో భాగంగా ఏడాదిన్నరగా అద్దంకి సీఐగా పని చేస్తున్న బేతపూడి ప్రసాద్‌ను గొట్టిపాటి పట్టుపట్టి డీఐజీ ద్వారా బదిలీ చేయించారు. ఆదివారం ఉదయానికి బదిలీ ఉత్తర్వులు వెలువడినట్లు విశ్వసనీయ సమాచారం.

ఆయన స్థానంలో గుంటూరు వీఆర్‌లో ఉన్న హైమారావును అద్దంకి సిఐగా బదిలీ చేయించారు. బేతపూడి ప్రసాద్‌ కరణం వర్గీయుడిగా ముద్ర వేసుకున్న విషయం తెలిసిందే. విషయం తెలుసుకున్న కరణం హుటాహుటిన పావులు కదిపారు.ఐజీతో పాటు ఏకం గా డీజీపీ పైనే ఒత్తిడి తెచ్చారు. అంతే..! ఆదివారం సాయంత్రానికి సీఐ బదిలీ ఆగిపోయింది. ప్రసాద్‌ బదిలీని నిలిపివేస్తున్నట్లు పోలీస్‌ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. దీంతో ఇరువర్గాల మధ్య వర్గవిభేదాలు పతాకస్థాయికి చేరాయి. తాను పార్టీలో చేరేటప్పుడే సీఐ బదిలీ ప్రధాన డిమాండ్‌గా చెప్పానని, ఇప్పుడు అది కూడా చేయకపోతే తాను పార్టీలో ఉండటం ఎందుకంటూ రవికుమార్‌ చినబాబు లోకేష్‌ వద్ద వాపోయినట్లు సమాచారం. తొలి డిమాండే నెరవేరకపోతే మిగిలిన హామీలు ఏం నెరవేరుస్తారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

సీఐని బదిలీ చేస్తే చేతకాని వాళ్లలా కూర్చోలేమని అటు చంద్రబాబుకు ఇటు లోకేష్‌లకు కరణం తేల్చి చెప్పినట్లు సమాచారం. అవసరమైతే అమీతుమీకి సిద్ధమని హెచ్చరించినట్లు తెలుస్తోంది. పదేళ్లు జెండాలు మోసి కార్యకర్తలు అష్టకష్టాలు పడ్డారని విస్మరిస్తే ఫలితం అనుభవించాల్సి ఉంటుందని కరణం తీవ్రస్థాయిలో విరుచుకుపడినట్లు సమాచారం. ఈ ఘటనతో ఇరువర్గాల మధ్య పోరు పతాకస్థాయికి చేరింది. ఈ పరిస్థితుల్లో అటు పార్టీ అధిష్టానం గొట్టిపాటికిచ్చిన హామీలను నెరవేర్చుకుం టుందా...? లేక పాత తరం సీనియర్‌ నేత కరణంకే ప్రాధాన్యతనిస్తుందా...? అన్నది వేచి చూడాల్సి ఉంది.....!

మరిన్ని వార్తలు