రెచ్చిపోయిన అధికార పార్టీ నేతలు

25 Jul, 2016 23:51 IST|Sakshi

నల్లచెరువు : భూ సమస్యపై విచారణకు వచ్చిన రెవెన్యూ అధికారుల సమక్షంలోనే వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై అధికార టీడీపీ నాయకులు రెచ్చిపోయారు. కొడవళ్లు, రాళ్లతో దాడి చేసి ముగ్గురిని గాయపరిచారు. సంజీవుపల్లి రైల్వేగేటు సమీపంలోని పొలంలో సోమవారం ఈ సంఘటన జరిగింది. బాధితులు సంజీవుపల్లికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు లక్ష్మినారాయణ, శ్రీరాములు, లక్ష్మన్నలు తెలిపిన మేరకు... 617–2 సర్వే నంబర్‌లో శ్రీరాములు తాత వెంకటప్పకు పూర్వీకుల ఆస్తి ఉంది. అదే గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీకి నాయకులు రాధాక్రిష్ణ, ఇంద్రసేన నాయుడు, వెంకటరమణ, గంగాద్రి, నారాయణప్పలు తమకు కూడా ఆ భూమిలో భాగం ఉందని తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు.

 

దీంతో ఇరువురి ఫిర్యాదు మేరకు తహసీల్దార్‌ కళావతి, వీఆర్‌ఓ నజీర్, సిబ్బంది సోమవారం రైల్వేగేటు సమీపంలోని పొలం వద్దకు వెళ్లి విచారణ చేపట్టారు. శ్రీరాములు తనపొలం హక్కు పత్రాలు చూపించాడు. మరోవర్గమైన తెలుగుదేశం పార్టీ నాయకులకు కూడా ఆస్తి హక్కు రికార్డులు చూపాలని తహసీల్దార్‌ అడుగుతుండగానే.. అక్కడే ఉన్న వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ నాయకులు దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో శ్రీరాములు, లక్ష్మినారాయణ, లక్ష్మన్న గాయపడ్డారు. వీరిని వెంటనే కదిరి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. శ్రీరాములు పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురం సర్వజనాస్పత్రిలో చేర్పించారు.

 

మరిన్ని వార్తలు