నగరంలో నయా కబ్జా

26 Oct, 2016 02:15 IST|Sakshi
నగరంలో నయా కబ్జా

సాక్షి ప్రతినిధి, ఒంగోలు/ఒంగోలు అర్బన్ : ఒంగోలు నగరంలో రూ.5 కోట్లకుపైగా విలువ చేసే 20 సెంట్ల (120 గదులు) స్థలాన్ని కాజేసేందుకు అధికార పార్టీ నేతలు సిద్ధమయ్యారు. పచ్చనేతలకు ఆ స్థలాన్ని అప్పగించేందుకు రెవెన్యూ అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. పట్టాలు పుచ్చుకోవడమే తరువాయి. నగరానికి చెందిన అధికార పార్టీ ముఖ్యనేత వెనుక ఉండి ఈ కథ నడిపిస్తుండగా, ఆయన అనుచరగణం ముందుండి దూసుకుపోతోంది. నగరంలోని గుంటూరు రోడ్డు బిలాల్‌నగర్‌లో సర్వే నంబర్ 116/1ఏ1ఏ పరిధిలో ఉన్న ఈ స్థలాన్ని కమ్యూనిటీ హాలుకుగానీ, మదర్సాలకుగానీ ఇవ్వాలని ఆ ప్రాంతానికి చెందిన ముస్లిం నేతలు, ప్రజలు చాలాకాలంగా కోరుతున్నారు.
 
 అరుునా పట్టించుకోని అధికారులు ఆ స్థలాన్ని పచ్చనేతలకు అప్పగించి వారివద్ద మెప్పు పొందేందుకు అత్యుత్సాహం చూపించడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవైపు వేలాది మంది పేదలు గూడు లేక ఇంటి పట్టాల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా స్పందించని అధికారులు.. నగరంలోని విలువైన స్థలాలను అధికార పార్టీ నేతలకు అప్పగించేందుకు సిద్ధం కావడంపై సర్వత్రా విమర్శలు తావిస్తోంది. నగరం నడిబొడ్డున విలువైన స్థలం కబ్జాకు గురవుతుంటే.. కార్పొరేషన్ ప్రత్యేకాధికారిగా ఉన్న కలెక్టర్ ఏమాత్రం పట్టించుకోకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇప్పటికే నగరంలోని పలు స్థలాలను అధికార పార్టీ నేతలు కబ్జా చేశారు. మనికొన్నింటిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
 
 ఇదీ.. బిలాల్‌నగర్ స్థలం నేపథ్యం...
 నగరంలోని గుంటూరు రోడ్డులో గల బిలాల్‌నగర్‌ను ఆనుకుని సర్వే నంబర్ 116/1ఏ1ఏలో మొత్తం 13.10 ఎకరాల వాగు పోరంబోకు భూమి ఉంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వాగు పోరంబోకు, కొండ పోరంబోకు, చెరువు పోరంబోకు భూములను నివాసాలకు ఇవ్వకూడదు. గతంలో పేదలు పోతురాజుకాలువ పరిసరాలలో 30 ఏళ్లుగా నివాసాలు ఏర్పాటు చేసుకుని ఉండటంతో వాటికి పట్టాలు మంజూరు చేశారు. బిలాల్‌నగర్‌లోని 20 సెంట్ల భూమిని ఒక సొసైటీకి ఇస్తూ తొలుత పట్టా మంజూరు చేశారు. ఆ స్థలాన్ని వినియోగించకపోవడంతో రెవెన్యూ శాఖ వెనక్కు తీసుకుంది. 2004లో అప్పటి కలెక్టర్ ఆ స్థలంలో రెండు సెంట్ల భూమిని టంగుటూరి ప్రకాశం పంతులు మనవడికి కేటారుుస్తూ పట్టా మంజూరు చేశారు.
 
  ఆ ప్రాంతంలో ఎక్కువగా నివాసాలు ఏర్పాటు కావడంతో అక్కడి స్థలాలకు ప్రస్తుతం విలువ పెరిగింది. దీంతో నగరానికి చెందిన అధికార పార్టీ ముఖ్యనేత అనుచరుడు కన్ను ఈ ప్రభుత్వ భూమిపై పడింది. ఆ స్థలాన్ని రెవెన్యూ వారు ఎవరికీ ఇవ్వడానికి వీలులేకుండా సదరు నేత నకిలీ పట్టాలు తయారుచేసి స్థలం తనదంటూ కోర్టును ఆశ్రయించారు. నకిలీ పట్టాలని తేలడంతో ఆ స్థలాన్ని రెవెన్యూ వారు స్వాధీనం చేసుకున్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే తిరిగి ముఖ్యనేత అనుచరుడు ఈ స్థలంపై కన్నేశాడు. ఆ స్థలంలో గత కలెక్టర్ విజయ్‌కుమార్ ఇద్దరు జర్నలిస్టులకు వారి కుటుంబ సభ్యుల పేరుమీద ఒకటిన్నర సెంట్ల చొప్పున కేటారుుస్తూ పట్టాలు మంజూరు చేశారు. అయితే, అధికార పార్టీ కబ్జాదారులు వారిని ఆ స్థలంలోకి రాకుండా అడ్డుకున్నారు. రెండున్నరేళ్ల పాటు ఈ వివాదం నడిచింది. చివరికి తాజాగా ఆ స్థలాన్ని వారిద్దరూ స్వాధీనం చేసుకున్నారు.    
 
 పచ్చ నేతల కోసం రూ.5 కోట్ల స్థలం...
 మిగిలిన 15 సెంట్ల (90 గదులు)ను అధికార పార్టీ నేతలు కబ్జా చేసేందుకు ప్రస్తుతం రంగం సిద్ధం చేసుకున్నారు. అధికారులు నేడో.. రేపో... వారికి ఆ స్థలాన్ని అప్పగించేందుకు రంగం సిద్ధం చేశారు. వాస్తవంగా ఒకటిన్నర సెంట్ల చొప్పున ఈ స్థలాన్ని 10 మంది అర్హులైన పేదలకు కేటాయించవచ్చు. కానీ, అధికార పార్టీ ముఖ్యనేత ఒత్తిడితో రెవెన్యూ అధికారులు ఆ ముఖ్యనేత పీఏతో పాటు ఆయన అనుచరులు ముగ్గురికి రూ.5 కోట్ల విలువైన మొత్తం స్థలాన్ని అప్పగించేందుకు సిద్ధమయ్యారు.
 
 ముస్లింల ఆందోళన...
 బిలాల్‌నగర్‌లో పేదలకు ఇచ్చిన స్థలాలుపోను మిగతా భూమిని ముస్లిం కమ్యూనిటీ హాలు, మదర్సాలకు ఇవ్వాలని బిలాల్‌నగర్ మదర్సా పోరాట సమితి ఆధ్వర్యంలో స్థానికులు మూడు రోజులుగా ఆందోళనలు చేపట్టారు. ఈ స్థలం కోసం పదేళ్లుగా పోరాటం చేస్తున్నామన్నారు. కలెక్టర్ స్పందించాలని కోరారు.
 
 రికార్డుల్లో గోల్‌మాల్...
 ఏ స్థలానికైనా రెవెన్యూ కార్యాలయంలో ఒక రికార్డు మాత్రమే ఉంటుంది. బిలాల్‌నగర్‌లో మాత్రం సర్వే నంబర్ 116/1ఏ1ఏ స్థలానికి మాత్రం రెండు అడంగళ్లు ఉన్నాయి. ఒక అడంగల్‌లో ఇది వాగు పోరంబోకు భూమిగా ఉండగా, మరో అడంగల్‌లో ఇళ్ల స్థలాలని పేర్కొన్నారు. ఒక సర్వే నంబర్‌లో రెండు రకాల అడంగళ్లను సృష్టించారంటే అధికార పార్టీ ఒత్తిళ్లు రెవెన్యూ అధికారులపై ఏ స్థారుులో ఉన్నాయన్న దానిపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
 

మరిన్ని వార్తలు