ఉపాధ్యాయిని అనుమానాస్పద మృతి

21 Oct, 2016 20:51 IST|Sakshi
ఉపాధ్యాయిని అనుమానాస్పద మృతి
* భర్తే చంపాడని తల్లిదండ్రుల ఆరోపణ
పరారీలో మృతురాలి భర్త
 
వినుకొండ రూరల్‌: అనుమానాస్పద స్థితిలో ఉపాధ్యాయురాలు మృతి చెందిన సంఘటన పట్టణంలోని శాలివాహననగర్‌లో గురువారం రాత్రి చోటు చేసుకుంది. బంధువులు తెలిపిన వివరాల మేరకు.. నరసరావుపేటకు చెందిన కాసా హనుమంతరావు, నాగేశ్వరమ్మల కుమార్తె వాసవిని గత ఏడాది డిసెంబర్‌ 5న  కొప్పుకొండకు చెందిన నూలి శ్రీనివాసరావుకు ఇచ్చి వివాహం చేశారు. శ్రీనివాసరావు వినుకొండ పట్టణంలోని ఎస్‌బీఐ ఎదురుగా మీసేవా కేంద్రం నిర్వహిస్తున్నారు. వాసవి నూజెండ్ల మండలం ఉప్పలపాడు గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయురాలు. వీరు పట్టణ శివారు శాలివాహన నగర్‌లో ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటున్నారు. భార్యపై అనుమానం పెంచుకున్న శ్రీనివాసరావు భార్యను తరచూ వేధించేవాడని, అదనపు కట్నం కోసం ఇంట్లో నిత్యం ఘర్షణకు దిగేవారని బంధువులు తెలిపారు. 
 
గురువారం వాసవి స్కూల్‌ నుంచి వచ్చిన తరువాత భార్యాభర్తలు ఘర్షణ పడినట్టు స్థానికులు తెలిపారు. రాత్రి ఆమె ఉరి వేసుకుందంటూ వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించాడు. గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్తుండగా సమాచారం తెలుసుకున్న బంధువులు బాధితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల జోక్యంతో మృతదేహాన్ని తిరిగి వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు చేర్చారు. ఒంటిపై గాయాలతో పాటు, మెడకు  వైరుతో బిగించిన ఆనవాలు కనిపించడంతో భర్తే అనుమానంతో హత్య చేశాడని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మతురాలి భర్త శ్రీనివాసరావు పరారీలో ఉన్నారు. పట్టణ కాపు సంఘం నాయకులు ఆమెకు నివాళులర్పించారు.
>
మరిన్ని వార్తలు