-
రోజుకో ఉత్తర్వుతో గందరగోళం
-
ముందుకు సాగని బదిలీల ప్రక్రియ
-
ఇప్పటికి నాలుగుసార్లు మారిన నిబంధనలు
-
నేడు సెక్రటేరియట్ ముట్టడికి ఉపా«ధ్యాయ సంఘాల పిలుపు
రాయవరం (మండపేట):
ఒకటోసారి...రెండోసారి..మూడోసారి అంటూ వేలం పాటలో చివరగా వేలం ఖరారు చేస్తారు. అయితే ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ వేలం పాట ఖరారును మించింది. ఇప్పటికి నాలుగుసార్లు నిబంధనలు మార్చారు. రోజుకో ఉత్తర్వుతో విద్యాశాఖ గందరగోళం సృష్టిస్తోందని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న స్థానంలో పనిచేసే పరిస్థితి లేనిచోట విద్యార్థులకు ఉపాధ్యాయులు బోధన చేయలేకపోతున్నారు. ఏ ఇద్దరు ఉపాధ్యాయులు కలిసినా బదిలీలపైనే చర్చించుకుంటున్నారు. తాజాగా బుధవారం మరో సవరణ ఉత్తర్వును ప్రభుత్వం విడుదల చేయడంతో ఒకడగు ముందుకు రెండడుగులు వెనక్కి అన్న చందంగా బదిలీల ప్రక్రియ మారుతుందని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
.
కూడికలు, తీసివేతల్లో..
పాఠశాలల్లో విద్యార్థులకు కూడికలు, తీసివేతలు చెప్పేవేళ ఉపాధ్యాయులే బదిలీ పాయింట్లపై కూడికలు తీసివేతల్లో మునిగిపోతున్నారు. ఉపాధ్యాయ బదిలీలపై ప్రభుత్వం సవరణలు చేసుకుంటూపోతోంది. పాయింట్ల కేటాయింపులో కొత్త నిబంధనలు చేర్చి సవరణ ఉత్తర్వు విడుదల చేయడంతో ఉపాధ్యాయులు గణాంకాల్లో నిమగ్నమవుతున్నారు. ఇప్పటికే పాత షెడ్యూల్ ప్రకారం బదిలీ దరఖాస్తు చేసుకున్నారు. పాఠశాలల రేషనలైజేషన్పై ఇంత వరకూ అధికారిక ఉత్తర్వులు వెలువడలేదు. ఇది తేలితేతప్ప పోస్టుల సంఖ్య తేలదు. మిగులు పోస్టులు, ఇతరత్రా వాటిపై పూర్తి స్థాయిలో స్పష్టత రావాల్సి ఉంది. రోజుకో సమాచారం విద్యాశాఖ విడుదల చేస్తోంది. దీంతో ఉపాధ్యాయుల్లో బదిలీలపై అస్పష్ట వాతావరణం ఏర్పడి వారిలో అయోమయానికి దారితీస్తుంది. రేషనలైజేషన్పై తేల్చకుండానే బదిలీలపై కసరత్తు చేస్తున్నారన్న వాదన వినిపిస్తోంది.
.
నూతన మార్గదర్శకాలు..
ఉపాధ్యాయ బదిలీల్లో కీలకమైన పాయింట్లు కేటాయింపుల్లో ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను బుధవారం విడుదల చేసింది. దీని ప్రకారం..2017 ఏప్రిల్ 30 నాటికి రెండు విద్యా సంవత్సరాలు పూర్తయిన వారు బదిలీకి దరఖాస్తు చేసుకోవచ్చు. ’కేటగిరి 4కు ఏడాదికి 2.25 పాయింట్లు కేటాయించనున్నారు. ఇప్పటి వరకు ఇవి రెండు పాయింట్లే ఉండేవి. ప్రస్తుతం 0.25 పాయింట్లు అదనంగా పెంచారు. ’కేటగిరి3కి తాజాగా ఏడాదికి 1.25 పాయింట్లకు పెంచారు. ’కేటగిరి–2కి 0.75 పెంచారు. ’కేటగిరి–1కి 0.50 పాయింట్లు ఇవ్వనున్నారు. ఈ కేటగిరీలో ఇప్పటి వరకు పాయింట్లు లేవు. సవరణ ఉత్తర్వుల్లో వీరికి పాయింట్లు కేటాయించారు.
.
నేడు సెక్రటేరియట్ ముట్టడికి పిలుపు...
బదిలీలు పూర్తిగా అసమగ్రంగా, అసంబద్దంగా ఉన్నాయంటూ ఉపాధ్యాయులు గురువారం అమరావతిలో సెక్రటేరియట్ను ముట్టడించనున్నారు. ఈ నెల 21న కాకినాడ డీఈవో కార్యాలయం వద్ద ఉపాధ్యాయులు భారీ సంఖ్యలో తరలి వచ్చి ముట్టడించిన విషయం పాఠకులకు విదితమే. పాయింట్ల విధానాన్ని, వెబ్ కౌన్సిలింగ్ను పూర్తిగా వ్యతిరేకిస్తున్న ఉపాధ్యాయుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్న నేపథ్యంలో బుధవారం నాటి ధర్నా విజయవంతం కావడానికి కారణంగా ఉపాధ్యాయ సంఘాల నేతలు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన తప్పును సరిదిద్దుకోవాలని సూచిస్తున్నారు. అమరావతిలో శుక్రవారం నిర్వహించనున్న సెక్రటేరియేట్ ముట్టడికి భారీ స్థాయిలో ఉపాధ్యాయులు తరలి వెళ్లేందుకు సిద్దమవుతున్నారు. ఉపాధ్యాయుల ఆందోళన ఉధృతమవుతున్న తరుణంలో బదిలీల నిబంధనలు, ప్రొసీజర్ మారే అవకాశాలు పుష్కలంగా ఉంటాయనే వాదనలు విన్పిస్తున్నాయి.