విజయవాడ(మధురానగర్) :
రాజస్థాన్లో పుట్టి విజయవాడలో విశేష సేవలందిస్తున్న తేజ్రాజ్ సోలంకీ అభినందనీయులని పలువురు వక్తలు కొనియాడారు. ఆయన 113 నెలలుగా వయోవృద్ధులకు నిత్యావసర వస్తువుల పంపిణీ చేయటం గొప్ప విషయమన్నారు. అల్లూరి సీతారామరాజు వంతెన సమీపంలోని విజయ నర్సింగ్ కళాశాలలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో వయోవృద్ధ చారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ తేజ్రాజ్ సోలంకీకి ‘మానవ సేవ–2016’ అవార్డును ప్రదానం చేసి సన్మానించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ఎక్కడ సేవా కార్యక్రమం జరిగినా తేజ్రాజ్ సోలంకీ పాత్ర తప్పక ఉంటుందన్నారు. ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ అధ్యక్షుడు ముత్తవరపు మురళీకృష్ణ మాట్లాడుతూ తన తండ్రి కోరిక మేరకు డాక్టర్ చల్లా హరికుమార్తో కలిసి తాము సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఏపీ ఫెడరేషన్ ఆఫ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రెసిడెంట్ వక్కలగడ్డ భాస్కరరావు, ఎన్బీఎల్ జైన్ పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్ ఎం.సురేష్ తాతీయ, శ్రీనీలిమా నర్సింగ్ హోం వైద్యుడు డాక్టర్ బి.హనుమయ్య, లయన్స్ జిల్లా గవర్నర్ ముల్పూరి ఉపేంద్ర ప్రసంగించారు. అనంతరం పుష్కరాల్లో వీల్ చైర్లు అందజేసిన దాతలను సన్మానించారు. వృద్ధులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. వయోవృద్ధ చారిటబుల్ ట్రస్టు చైర్మన్ డాక్టర్ చల్లా హరికుమార్, మేనేజింగ్ ట్రస్టీ తట్టి అర్జునరావు పాల్గొన్నారు.