ఆలయ ఉద్యోగుల పదవీ విరమణా 60 ఏళ్లకే..

29 Mar, 2017 23:06 IST|Sakshi
-2014 జూన్‌ నుంచి వర్తింప చేస్తూ జీఓ 
-అన్నవరం దేవస్థానంలో 9 మందికి ప్రయోజనం
అన్నవరం : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెంచినట్టుగానే తమకూ పదవీ విరమణ వయోపరిమితిని 60 సంవత్సరాలకు పెంచాలని ఆందోళన చేస్తున్న దేవాలయ ఉద్యోగుల వినతిని రాష్ట్రప్రభుత్వం అంగీకరించి మంగళవారం రాత్రి  జీఓ విడుదల చే సింది. దీంతో ఆ ఉద్యోగుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఈ జీఓ వలన అన్నవరం దేవస్థానంలో తొమ్మిది మందికి ప్రయోజనం చేకూరుతుండగా, అన్ని రాష్ట్రంలోని అన్ని దేవస్థానాలలోను సుమారు వంద మంది వరకూ ప్రయోజనం పొందనున్నారు. అన్నవరం దేవస్థానంలో వెంటనే ఎనిమిది మంది ఉద్యోగులను విధుల్లోకి తీసుకుంటామని ఈఓ నాగేశ్వరరావు తెలిపారు. ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ ప్రసాదరావును తిరిగి విధుల్లోకి తీసుకునే విషయమై కమిషనర్‌ అనుమతి తీసుకోవల్సి ఉందన్నారు.
   ప్రభుత్వ ఉద్యోగులకు  పదవీ విరమణ  వయోపరిమితిని 60 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం జూన్‌ 6, 2014న జీఓ విడుదల చేసింది.  అయితే దేవాలయాల ఉద్యోగులకు మాత్రం ఈ పెంపు అమలు కాక 58 సంవత్సరాలకే పదవీ విరమణ చేయాల్సి వచ్చింది. పదవీ విరమణ చేసిన దేవాలయ ఉద్యోగులు న్యాయస్థానాలను ఆశ్రయించి స్టేలు పొందగా కొన్ని దేవస్థానాల్లో మాత్రమే అమలు చేశారు. అన్నవరం దేవస్థానంలో ఆరుగురికి కోర్టు స్టే వచ్చినా వివిధ కారణాలతో ఒక్కరిని  మాత్రమే వి«ధుల్లోకి తీసుకున్నారు. 2016 అక్టోబర్‌లో ఆలయ ఉద్యోగులకు కూడా పదవీ విరమణ వయోపరిమితి పెంచుతూ మరో జీఓ విడుదలైంది. అందులో 2016 అక్టోబర్‌లో పదవీ విరమణ చేసేవారికే వర్తిస్తుందని పేర్కొనడంతో  2014 జూన్‌ 6 నుంచి 2016 సెప్టెంబర్‌ 30 మధ్య పదవీ విరమణ చేసిన వారికి అవకాశం లేకుండా పోయింది. ఈ జీఓ మీద కూడా ఉద్యోగులు పోరాటం చేయడంతో చివరకు ప్రభుత్వం 2014 జూన్‌ నుంచి  పదవీ విరమణ వయో పరిమితి పెంచుతూ జీఓ విడుదల చేసింది. ప్రభుత్వ జీఓ ప్రకారం 8 మంది ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకుంటామని ఈఓ కే నాగేశ్వరరావు బుధవారం రాత్రి ‘సాక్షి’కి తెలిపారు. 
మరిన్ని వార్తలు