రైలు ప్రయాణికులకు విజ్ఞప్తి..

20 Sep, 2017 19:27 IST|Sakshi
రైలు ప్రయాణికులకు విజ్ఞప్తి..

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఫ్లాట్‌ఫాం టికెట్‌ చార్జీ పెంపు

సాక్షి, హైదరాబాద్‌: దసరా సెలవులకు ఊరికి వెళుతున్న మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులకు వీడ్కోలు పలికేందుకు సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు వెళుతున్నారా? అయితే ఇది గమనించండి. గురువారం నుంచి ఫ్లాట్‌ఫాం టికెట్‌ చార్జీలు పెరుగుతున్నాయి. దసరా రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈ నెల 21 నుంచి అక్టోబర్‌ 3 వరకు ఫ్లాట్‌ఫాం టికెట్‌ చార్జీలు తాత్కాలికంగా పెంచుతున్నట్టు దక్షిణమధ్య రైల్వే బుధవారం తెలిపింది.

సాధారణ రోజుల్లో ఉండే రూ.10 టికెట్‌ను రూ.20కి పెంచుతున్నట్టు ప్రకటించింది. 13 రోజుల పాటు పెంచిన చార్జీలు అమలవుతాయని వెల్లడించింది. స్టేషన్‌పై ఒత్తిడిని తగ్గించేందుకు, ప్రయాణికులు కాని వాళ్ల ప్రవేశాన్ని నియంత్రించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. అనవసరమైన వ్యక్తుల ప్రవేశాన్ని నియంత్రించి, ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చూసేందుకు ఫ్లాట్‌ఫాం టికెట్‌ చార్జీ పెంచామని వివరించింది.

పండుగల రోజుల్లో ప్రయాణికులతో రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతుంటాయి. తమ వారిని ఊళ్లకు సాగనంపేందుకు ప్రయాణికులతో పాటు వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు స్టేషన్‌కు తరలివస్తుంటారు. దీంతో రద్దీ అనూహ్యంగా పెరుగుతుంది. రద్దీకి అనుగుణంగా స్టేషన్‌ నిర్వహణ చేపట్టడంతో పాటు, భద్రత కూడా నిర్వాహకులకు సవాల్‌గా మారుతుంది. దీంతో పండుగ సీజన్లలో అనవసర రద్దీని నియంత్రించేందుకు గత కొన్నేళ్లుగా ఫ్లాట్‌ఫాం టికెట్‌ చార్జీలను తాత్కాలికంగా పెంచుతూ వస్తున్నారు.

మరిన్ని వార్తలు