ముద్రగడ నివాసం వద్ద ఉత్కంఠ

7 Feb, 2016 08:14 IST|Sakshi
ముద్రగడ నివాసం వద్ద ఉత్కంఠ

కిర్లంపూడి: కాపులకు రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ తో ముద్రగడ పద్మనాభం దంపతులు చేపట్టిన దీక్ష ఆదివారంతో మూడో రోజుకు చేరింది. తమ ఆరోగ్యపరిస్థితిపై వైద్యులు చేస్తున్న ప్రకటనలు అసత్యాలని, తాము ఆరోగ్యంగానే ఉన్నామని పేర్కొంటున్న ముద్రగడ.. వైద్యపరీక్షలకు నిరాకరిస్తున్నారు. ఈ క్రమంలో వైద్యులు లోపలికి రాకుండా శనివారం రాత్రి ఇంటి తలుపులు మూసేసిన ఆయన.. ఇప్పటివరకూ లోపలే ఉండిపోయారు. దీంతో అక్కడ ఉత్కంఠ పరిస్థితి నెలకొంది.

ముద్రగడ దంపతులకు వైద్యపరీక్షలు నిర్వహించేందుకు ఆదివారం ఉదయమే వైద్యులు అక్కడికి చేరుకున్నారు. అయితే లోపలికి వెళ్లే అవకాశంలేక బయటే నిరీక్షిస్తున్నారు. దీక్ష చేపట్టి మూడు రోజులు కావడంతో దంపతుల ఆరోగ్యం క్షీణించినట్లు తెలుస్తోంది. వారితోపోటు కుటుంబసభ్యులు కూడా దీక్షలో కూర్చున్న సంగతి తెలిసిందే. ముద్రగడకు సంఘీభావం తెలిపేందుకు ఆదివారం కూడా అభిమానులు పెద్ద ఎత్తున కిర్లంపూడికి చేరుకుంటున్నారు.

>
మరిన్ని వార్తలు