పటాన్చెరు టౌన్: బోనస్ విషయంమై అధికార కార్మిక సంఘం, ప్రతిపక్ష కార్మిక సంఘం సభ్యుల మధ్య ఘర్షణ జరిగిందని, అధికార పక్ష సంఘం బయట నుండి వ్యక్తులను తీసుకొని వచ్చి తమపై దాడికి పాల్పడిందని ప్రతిపక్ష కార్మిక సంఘం సభ్యులు తెలిపారు. వారి కథనం ప్రకారం పాశమైలారం పారిశ్రామికవాడలోని కిర్బి పరిశ్రమలో అధికార కార్మిక సంఘం టీఆర్ఎస్కేవీ సభ్యులు ఈ సారి దసరా బోనస్గా రూ. 17500 కార్మికులకు ఇస్తున్నట్లు ప్రకటించడంతో ప్రతిపక్ష కార్మిక సంఘం బీఎంఎస్ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజేష్ , ప్రస్తుత వర్కింగ్ ప్రెసిడెంట్ జయకుమార్, జనరల్ సెక్రెటరీ శ్రీనివాస్లు కలుగజేసుకుని గతంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారమే రూ. 16800 బోనస్ ఇచ్చామని, ఇప్పుడు ఆ లెక్కన అంతకుమించి బోనస్ ఇప్పించాలని డిమాండ్ చేశారు.
ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. దీంతో అధికార కార్మిక సంఘం సభ్యులైన గోపాల్, శ్రీనివాస్, మల్లేశ్, అమ్రుద్దీన్లు బయటి నుంచి వ్యక్తులను పిలిపించి జయకుమార్ను కంపెనీ గేట్ ఎదురుగా తీవ్రంగా కొట్టారని బీఎంఎస్ సభ్యులు చెప్పారు. దీంతో తీవ్రంగా గాయపడిన బాధితుడిని తోటి కార్మికులు చికిత్స కోసం మదీనగూడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటనపైబీడీఎల్ పోలీసు స్టేషన్లో రెండు వర్గాలవారు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు.
బాధితుడిని పరామర్శించిన ఎమ్మెల్యే కిషన్రెడ్డిమదీనగూడలోని ఓ ప్రైవేటఆస్పత్రిలో చికిత్సపొందుతున్న జయకుమార్ను బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సత్యనారాయణ పరామర్శించారు. ఈ సందర్భంగా కార్మికులకు ధైర్యం చెప్పారు. మీ మెంట మేమున్నామని, అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు.
ఇరువర్గాలపై కేసు
ఈ విషయంపై బీడీఎల్ సీఐ కిషోర్ను వివరణ కోరగా కార్మికులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారని, ఇరువర్గాల ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.