మరో మూడు బీసీ హాస్టళ్ల మూసివేత..!

11 Aug, 2016 00:38 IST|Sakshi
 
  • కలెక్టర్‌కు నివేదిక అందజేసిన అధికారులు
  • ఆరుకు చేరిన సంఖ్య
హన్మకొండ అర్బన్‌: విద్యార్థులు లేని కారణంగా గత ఏడాది మూడు బీసీ హాస్టళ్లను మూసివేసిన అధికారులు తాజాగా మరో మూడింటికి కూడా తాళం వేసేందుకు సిద్ధమయ్యారు.
 
విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా ఒక్క విద్యార్థి కూడా బీసీ హాస్టళ్లలో చేరేందుకు ఆసక్తి చూపడం లేదు. దీంతో వాటిని మూసివేసేందుకు అనుమతి ఇవ్వాలని బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారులు కలెక్టర్‌కు నివేదిక పంపించారు. ఒకటి, రెండు రోజుల్లో కలెక్టర్‌ నుంచి ఉత్తర్వులు రాగానే బచ్చన్నపేట, మహ బూబాబాద్, నల్లబెల్లి మండలంలోని నాచినపల్లి బీసీ బాలుర హాస్టళ్లను అధికారులు మూసివేయనున్నారు. ఇదిలా ఉండగా, గత ఏడాది జిల్లాలోని మూడు హాస్టళ్లను విద్యార్థులు లేక మూసివేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో మూడు హాస్టళ్లు కూడా మూతపడేందుకు సిద్ధంగా ఉండడంతో వాటి సంఖ్య ఆరుకు చేరినట్లయింది. కాగా, జిల్లాలోని మరికొన్ని హాస్టళ్లలో కూడా ప్రసుత్తం విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంది. దీంతో ఈ సంఖ్యను పెంచుకునేందుకు వార్డెన్లకు ఈ నెలాఖరువరకు కలెక్టర్‌ గడువు విధించారు. నెలాఖరు తర్వాత కూడా విద్యార్థుల సంఖ్య కనీసం 30 మందికి దాటకుంటే వాటిని కూడా మూసివేసి ఉన్న వారిని పక్క హాస్టళ్లకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ లెక్కన జిల్లాలో మరో ఐదు నుంచి ఆరు వసతిగృహాలు కూడా మూత పడే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం మూతపడుతున్న హాస్టళ్లలోని వార్డెన్లు, వర్కర్లను ఇతర ప్రాంతాల్లో అవసరం ఉన్న చోటకు సర్దుబాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. 
మరిన్ని వార్తలు