దాహార్తితో ప్రాణాలొదిలిన లేగదూడ

4 May, 2016 20:27 IST|Sakshi

 విపరీతమైన ఎండలు.. తాగునీటి ఎద్దడి.. అంతటా అలుముకున్న కరువుతో మనుషులే కాదు.. మూగజీవాలు తల్లడిల్లుతున్నాయి.  ఖమ్మం జిల్లా మణుగూరు మండలం సమితిసింగారం గ్రామ పంచాయతీ పీవీ కాలనీ రోడ్డు రైల్వేగేట్ వద్ద బుధవారం మధ్యాహ్నం ఓ లేగదూడ ఎండతీవ్రత, దాహంతో ప్రాణాలొదిలింది. సింగరేణి బొగ్గు గనులు ఉండడం వల్ల ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటున్నాయి.

ఈ క్రమంలో మేతకొచ్చిన దూడ..దప్పికకు తాళలేక సమీపంలోని ఇళ్ల వద్దకు చేరుకొని అటూఇటూ తచ్చాడినా నీటి జాడ కనిపించలేదు. డ్రెయినేజీలో నీళ్లు తాగేందుకు ప్రయత్నించినా..అంతా మురుగే ఉండడంతో మింగలేక.. చివరికి ఊపిరొదిలింది. కొద్దిసేపటికే అక్కడికొచ్చిన తల్లిఆవు..దూడ శరీరాన్ని నాలుకతో నాకుతూ..తలతో ఆటూఇటూ నెట్టుతూ లేపేందుకు ప్రయత్నిస్తూ..‘తల్లి’డిల్లింది. దూపతోనే అల్లాడుతోందని అక్కడి వారు గ్రహించి బక్కెట్‌లో నీళ్లు పెట్టగా, ఆవు ఆతృతగా తాగడం..అప్పటికే దూడ ఊపిరొదిలిన సంఘటన..స్థానికులను కలచివేసింది.

 

మరిన్ని వార్తలు