-
పోడు భూమిలో మొక్కలు నాటడానికి
-
అధికారులు రావడంతో ఘటన
-
నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స్చ
ఖానాపురం : పోడు భూమిని సాగు చేసుకుంటున్న దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన బుధరావుపేట గ్రామ పంచాయతీ పరిధిలోని చిలుకమ్మనగర్ గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. స్థానికులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. చిలుకమ్మనగర్ గ్రామానికి చెందిన కాసాని ఐలయ్య–కోమల దంపతులు తొమ్మిది సంవత్సరాల క్రితం 2 ఎకరాల పోడు భూమిని కొనుగోలు చేసి పంటలు సాగు చేసుకుంటున్నారు.
ఈ క్రమంలో శనివారం అటవీశాఖ అధికారులు మొక్కలు నాటడానికి గ్రామ శివారులో ఉన్న పోడు భూమి వద్దకు వెళ్లారు. అక్కడే ఉన్న ఐలయ్య–కోమల దంపతులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. 9 సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్నామని, ఈ భూమిపైనే తమ ఇద్దరు కుమార్తెల జీవితం ఆధారపడి ఉందని వారు అధికారులతో వా పోయారు. కానీ, ఫారెస్ట్ భూమిలో మొక్కలు నాటుతామని చెప్పడంతో ఆందోళనకు గురై న కోమల భూమి వద్ద ఉన్న మోనోక్రోటోపాస్ మందును తాగడానికి ప్రయత్నిస్తుండటంతో పక్కనే ఉన్న భర్త చేయితో కొట్టడంతో కింద పడిపోయింది. అదే మందు డబ్బాను తీసుకుని ఐలయ్య సైతం తాగే ప్రయత్నం చేయడంతో అప్పటికే అక్కడకు చేరుకున్న చుట్టుపక్కల రైతులు లాక్కునే క్రమంలో ఒంటిపై పడింది. వెంటనే రైతులు.. ఆ దంపతులను నర్సంపేటలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. ఈ విషయమై ఎఫ్ఆర్వో సుధీర్ను వివరణ కోరగా మొక్కలు నాటడానికి తమ సిబ్బంది ఎవరూ రాలేదని, మందు తాగిన విషయం తమకు తెలియదని పేర్కొన్నారు.