కోడల్ని వేధిస్తున్నాడని కొట్టి చంపారు..

11 Apr, 2016 19:39 IST|Sakshi

కోడలిని వేధిస్తున్న మామపై బాధితురాలి కుటుంబ సభ్యులు దాడి చేసి తీవ్రంగా కొట్టారు. ఆ దెబ్బలకు తాళలేక ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన జిన్నారం మండలం బొల్లారం పోలీస్‌స్టేషన్ పరిధిలోని గండిగూడెం గ్రామంలో జరిగింది.

 బొల్లారం ఎస్‌ఐ ప్రశాంత్ కథనం ప్రకారం.. గండిగూడెం గ్రామానికి చెందిన రాజంగారి యాదయ్య (65) కుమారుడు ఏడాది క్రితం ప్రమాదవశాత్తు చనిపోయాడు. దీంతో యాదయ్య, అతని భార్య పోచమ్మ, కోడలు అరుణ ఒకే ఇంట్లో ఉంటున్నారు. కొన్ని రోజులుగా కోడలు అరుణ పట్ల యాదయ్య అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఆమె అభ్యంతరం చెప్పినా అతడు మానలేదు. విసుగుచెందిన అరుణ తన పుట్టింటి వారికి ఈ విషయాన్ని చెప్పింది. ఆదివారం రాత్రి యాదయ్యను అరుణ కుటుంబీకులు తీవ్రంగా కొట్టారు. తీవ్రంగా గాయాలపాలైన యాదయ్య అక్కడికక్కడే చనిపోయాడు. పోచమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు