సుడిగాలికి కూలిన టెంట్‌

24 Aug, 2016 01:39 IST|Sakshi

–విద్యుత్‌ తీగ తెగి మంటలు
–టెంట్‌ కర్రలు పడి ఇద్దరికి గాయాలు
వాడపల్లి(మిర్యాలగూడ రూరల్‌): వాడపల్లిలోని పాత సిమెంట్‌ రోడ్డు పుష్కర ఘాట్‌ వద్ద టెంట్‌ కూలి ఇద్దరు భక్తులకు గాయాలైనాయి. ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో సుమారు 80 మంది భక్తులు టెంటు కింద కూర్చున్నారు. కాగా ఒకేసారి బలమైనగాలి వీచడంతో టెంట్‌ పైకి లేచి  కుప్పకూలింది. దీంతో టెంట్‌ కర్ర విద్యుత్‌ తీగలపై పడి మంటలులేశాయి. ఊహించని పరిణామానికి భక్తులు భయాందోళనలో పరుగులు తీశారు. కొందరు టెంటుకిందే ఉండిపోగా ప్రాణ భయంతో  కేకలు వేశారు. అక్కడేlవిధులు నిర్వహిస్తున్న పోలీసు కానిస్టేబుల్‌ భాస్కర్‌ నాయక్‌ పరిగెత్తి టెంట్‌ను లేపి దూరంగా విరిరేశాడు. అప్పటికే టెంటుకు మంటలు అంటుకోవడంతో  భక్తురాలి బ్యాగు కాలిపోయింది. టెంటు కర్రలు తగిలి గుండాల మండలం సీతారామపురం గ్రామానికి చెందిన  మొగిలిపాక యాదమ్మకు తలకు తీవ్రగాయమైంది. ఆమె కుమారుడు రవికి గాయాలైనాయి. దీంతో వైద్య సిబ్బంది వెంటనే ఇద్దరికి ప్రథమ చికిత్స అందించారు. యాదమ్మను 108లో మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తర లించారు.  టెంట్‌ కూలిన స్థలాన్ని జిల్లా వైద్యాధికారి భానుప్రసాద్‌ నాయక్, ఘాట్‌ రక్షణ ఇన్‌చార్జి డీఎస్పీ రామచందర్‌రావు  పరిశీంచారు. సంఘటనకు కారణాలు అడిగి తెలుసుకొన్నారు. టెంటుకు మంటలు అంటుకున్నా సమయస్ఫూర్తిగా వ్యవహరించి ప్రమాద తీవ్రతను తగ్గించిన కానిస్టేబుల్‌ భాస్కర్‌ నాయక్‌ ను అధికారులు అభినందించారు.
 

మరిన్ని వార్తలు