ఇంకెన్నాళ్లు.. ఎదురుచూపులు?

30 Jan, 2017 22:31 IST|Sakshi

చేతికందని బీసీ, ఎస్సీ  కార్పొరేషన్‌ రుణాలు
అప్పు చేసి బ్యాంకుల్లో  డిపాజిట్లు చేసిన నిరుద్యోగులు
కార్యాలయాల చుట్టూ   తిరుగుతూ విసిగిపోతున్న  అర్హులు


కథలాపూర్‌ (వేములవాడ) : వారంతా ఆర్థిక స్తోమత అంతంతగా ఉన్న నిరుద్యోగులు. సొంత కాళ్లపై నిలబడాలనేది వారి లక్ష్యం...కిరాణ దుకాణం.. గేదెలు, ఆవుల పెంపకం, వాహనాల కొనుగోలు.. ఇలా ఏదో ఒక దానిని ఏర్పాటు చేసుకోవాలనేది ఉపాధి పొందాలని వారి అభిమతం. ఈ క్రమంలోనే బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వం అందించే రుణాల కోసం వారు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తుల పరిశీలన, ఇంటర్వూ్యలు సైతం పూర్తయి లబ్ధిదారుల జాబితాను సైతం అధికారులు ప్రకటించారు. ఈ ప్రక్రియ అంతా  2015–16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించింది. అర్హులైన వారంతా నెలల తరబడి మండల పరిషత్, కార్పొరేషన్ల కార్యాలయాల చూట్టూ తిరుగుతున్నా రుణం చేతికందని పరిస్థితి. ప్రభుత్వం సబ్సిడీ మంజూరు చేయకపోవడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు.

స్వయం ఉపాధి రుణాలకు 405 దరఖాస్తులు..
కథలాపూర్‌ మండలంలో 18 గ్రామాలుండగా.. బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా 2015–16 ఆర్థిక సంవత్సరానికి స్వయం ఉపాధి కోసం రుణాలు మంజూరైనట్లు డిసెంబర్‌ 2015లో అధికారులు ప్రకటించారు. సుమారు 405మంది అప్పట్లో దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో బీసీ కార్పొరేషన్‌కు 197, ఎస్సీ కార్పొరేషన్‌కు 159 మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తులను పరిశీలన చేసి నిరుద్యోగులకు గతేడాది మార్చిలో బ్యాంకు అధికారులు, మండల పరిషత్‌ అధికారులు సమష్టిగా ఇంటర్వూ్యలు నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక జాబితాను రూపొందించారు. ఇంటర్వూ్యలు నిర్వహించిన అధికారుల బృందం బీసీ కార్పొరేషన్‌ యూనిట్లు 30, ఎస్సీ కార్పొరేషన్‌ యూనిట్లు 50  మంజూరుతో జాబితాను ప్రకటించారు. ఇదంతా బాగానే ఉన్నా.. నేటికి నిరుద్యోగులకు రుణాలు అందకపోవడం గమనార్హం.

పది నెలలుగా కాలయాపన
బీసీ, ఎస్సీ కార్పొరేషన్‌ రుణాలకు ఎంపికైన వారు బ్యాంకుల్లో ష్యూరిటీ పేరిట వేలాది రూపాయలు డిపాజిట్లు చేశారు. బ్యాంకు అధికారులు డిపాజిట్‌ చేయాల్సిందేనని ఒత్తిడి చేయడంతో అప్పు చేసి చెల్లించామని పలువురు వాపోతున్నారు. ఎప్పుడు అడిగిన ఇదిగో.. అదిగో అంటూ 10 నెలలుగా కాలయాపన చేస్తున్నారని నిరుద్యోగులు వాపోతున్నారు.
 

మరిన్ని వార్తలు