దొంగ అరెస్ట్‌

12 Sep, 2017 23:28 IST|Sakshi

మడకశిర : మడకశిర పోలీసులు మంగళవారం నరసింహమూర్తి అలియాస్‌ గుండు అనే దొంగను అరెస్ట్‌ చేశారు. ఇతని నుంచి రూ.4 లక్షలు విలువ చేసే 130 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. సీఐ శుభకుమార్, అమరాపురం ఎస్‌ఐ వెంకటస్వామిలు సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కర్ణాటకలోని పావగడ నియోజకవర్గం మూగుదాళబెట్టకు చెందిన కాపు నరసింహమూర్తి ఆలియాస్‌ గుండు అమరాపురం మండలం గుణేహళ్లి, ఆలదపల్లి, పేలుబండ, గుడిబండ మండలం హెచ్‌ఆర్‌ హట్టి గ్రామాల్లో పగటి పూట తాళం వేసిన ఇళ్లను టార్గెట్‌ చేసుకుని దొంగతనాలకు పాల్పడ్డాడు.

బాధితుల ఫిర్యాదుల మేరకు పోలీసులు కొన్ని నెలలుగా గాలింపు చేపట్టారు. మంగళవారం ఉదయం 10గంటల సమయంలో కాపు నరసింహమూర్తి తను దొంగిలించిన బంగారు ఆభరణాలను విక్రయించడానికి మోటారుసైకిల్‌లో వెళుతుండగా అమరాపురం మండలం చిట్నడుకు క్రాస్‌వద్ద ఎస్‌ఐ వెంకటస్వామి తన సిబ్బందితో చాకచక్యంగా అరెస్ట్‌ చేశారు. మొత్తం 4కేసుల్లో 130 గ్రాముల బంగారు ఆభరణాలను ఇతడు దొంగిలించినట్లు సీఐ తెలిపారు. కోర్టులో హాజరుపరచగా.. మెజిస్ట్రేట్‌ రిమాండ్‌కు ఆదేశించారన్నారు.

మరిన్ని వార్తలు