సీసీటీవీ కేబుళ్లను కత్తిరించి....దోచేశారు

20 Nov, 2015 13:37 IST|Sakshi

గోదావరిఖని: కరీంనగర్ జిల్లాలో దోపిడీ దొంగలు... సీసీ కెమెరాలకు కంటపడకుండా చోరీలు చేసి నగదును దోచుకుపోయారు. గోదావరిఖనిలోని లక్ష్మి నగర్‌లో గురువారం రాత్రి రెండు షాపుల్లో చోరీలు జరిగాయి. పట్టణంలోని రీగల్ షూమార్ట్, హ్యాండ్లూమ్ షూ కంపెనీ షట్టర్ల తాళాలు పగులగొట్టి దొంగలు రూ.1.70 లక్షల నగదును ఎత్తుకుపోయారు. సీసీ కెమెరాల్లో రికార్డుకాకుండా దొంగలు తెలివిగా వ్యవహరించారు.

 

షాపులోనికి ప్రవేశించిన దొంగలు ముందుగా సీసీ కెమెరాల కేబుళ్లను కత్తిరించారు. ఆ తర్వాత నగదును దోచుకున్నారు. పని పూర్తి చేసుకుని వెళ్ళేటప్పుడు సీసీటీవీ సెట్‌టాప్ బాక్స్‌ను కూడా ఎత్తుకుపోయారు. శుక్రవారం ఉదయం షాపు తెరించేందుకు వచ్చిన యజమానులు చోరీ జరిగినట్టు తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరికి గురైన రెండు దుకాణాల యాజమాన్యం ఒక్కరే కావడం విశేషం. డీఎస్పీ మల్లారెడ్డి, సీఐలు తమ సిబ్బందితో సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
 

మరిన్ని వార్తలు