మంత్రికి బెదిరింపు కాల్స్!

14 Jan, 2016 02:12 IST|Sakshi
మంత్రికి బెదిరింపు కాల్స్!

శ్రీకాళహస్తి: రాష్ట్ర అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి తమిళనాడుకు చెందిన ఎర్రచందనం స్మగ్లర్లు బుధవారం ఫోన్ చేసి బెదిరించినట్లు సమాచారం. ఏర్పేడులో ఆరుగురు తమిళనాడుకు చెందిన ఎర్రచందనం స్మగ్లర్లను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. 32 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా గతంలో శేషాచలం అడవుల్లో స్మగ్లర్లపై జరిగిన ఎన్‌కౌంటర్ తదితర అనేక సంఘటనల నేపథ్యంలో ఎర్రచందనం స్మగ్లర్లు మంత్రికి ఫోన్ చేసి బెదిరించినట్లు పట్టణంలో జోరుగా చర్చసాగుతోంది.

ఈ మేరకు మంత్రి పోలీస్ బాస్‌కు సమాచారం ఇచ్చినట్లు చెబుతున్నారు. పోలీసు ఉన్నతాధికారులు అప్రమత్తమై తనిఖీలు ముమ్మరం చేయాలని డీఎస్పీ వెంకటకిషోర్‌ను ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై మంత్రిని వివరణ కోరగా గతంలో దేవాదాయశాఖ మంత్రిగా ఉన్న సింహాద్రి సత్యానారాయుణకు విజయవాడలో బెదిరింపు కాల్స్ వచ్చినపుడు 'వృద్ధుడిని నన్నేం చేస్తారని' చెప్పేవాడని, నాదీ అదే పరిస్థితి అంటూ సమాధానం ఇచ్చారు.
 

మరిన్ని వార్తలు