కృష్ణా పుష్కరాలకు పటిష్ట బందోబస్తు

2 Aug, 2016 23:18 IST|Sakshi
కృష్ణా పుష్కరాలకు పటిష్ట బందోబస్తు
– 3వేల మంది పోలీసు అధికారులు, సిబ్బంది నియామకం
– ఐజీ శ్రీధర్‌రావు వెల్లడి
– సంగమేశ్వరంలో భద్రత ఏర్పాట్ల పరిశీలన
 
కర్నూలు : కృష్ణా పుష్కరాల విధుల్లో అలసత్వం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని రాయలసీమ ఐజీ శ్రీధర్‌రావు హెచ్చరించారు. మంగళవారం సంగమేశ్వరంలో జరుగుతున్న పుష్కర పనులను ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ పుష్కరాలకు వచ్చే భక్తుల భద్రతే ప్రధాన లక్ష్యంగా పోలీసులు విధులు నిర్వహించాలన్నారు. భక్తుల సంఖ్యను బట్టి ఘాట్‌ల వద్దకు విడతలవారీగా పంపించాలన్నారు. అనుమానితులపై నిఘా ఉంచి అప్రమత్తం కావాలన్నారు. వాహనాల పార్కింగ్, ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. శ్రీశైలం, సంగమేశ్వర పుష్కర ఘాట్లలో 3వేల మంది భద్రతా దళాలను నియమిస్తామన్నారు. అనంతరం సంగమేశ్వరం వద్ద విధులు నిర్వహించే పోలీసులకు విడిదికోసం ఏర్పాటు చేసిన ముసలిమడుగు ఉన్నత పాఠశాలను పరిశీలించారు. కొలనుభారతి క్షేత్రం చేరుకొనిఅమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట అడిషనల్‌ ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, ఆత్మకూరు డీఎస్పీ సుప్రజ, ఆదోని మహిళా డీఎస్పీ వెంకటాద్రి, ఆత్మకూరు, ఆదోని  సీఐలు దివాకర్‌రెడ్డి, రామయ్యనాయుడు, గౌస్,  పాములపాడు ఎస్‌ఐ సుధాకర్‌రెడ్డి ఉన్నారు. 
 
మరిన్ని వార్తలు