ఆలేరు : నవంబర్ 13న హైదరాబాద్లో జరిగే మాదిగ మహాశక్తి బహిరంగ సభను జయప్రదం చేయాలని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి అన్నారు. ఆలేరులో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో జనాభా దామాషా ప్రకారం మాదిగలకు 12శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు. ఎస్సీ వర్గీకరణ జరిగే వరకు మాదిగ జేఏసీ పక్షాన ఉద్యమం కొనసాగుతుందన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకు వస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు పేదలకు అందాలన్నారు. మాదిగ మహాశక్తి బహిరంగ సభకు మాదిగ యువత పెద్దసంఖ్యలో తరలిరావాలని కోరారు. ఈ సమావేశంలో క్యాసగల్ల శ్రీకాంత్, క్యాసగల్ల యాదగిరి, కర్రె అశోక్, భిక్షపతి, ఆంజనేయులు, సంతోష్ పాల్గొన్నారు.