ప్రతి నీటిబొట్టును సద్వినియోగం చేసుకోవాలి

26 Sep, 2016 21:26 IST|Sakshi
ప్రతి నీటిబొట్టును సద్వినియోగం చేసుకోవాలి
తుంగతుర్తి
ప్రతి నీటిబొట్టును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని కొత్తగూడెం, వెంపటి, రావులపల్లిలో ఎస్సారెస్పీ కాల్వలకు విడుదలయిన బయ్యన్న వాగు రిజర్వాయర్‌ జలాలను పరిశీలించి మాట్లాడారు. 2017 జూన్‌ వరకు అస్తవ్యస్తంగా ఉన్న ఎస్సారెస్పీ కాల్వలను పూర్తి చేసి అన్ని గ్రామాల్లోని చెరువులకు నీటిని సరఫరా చేసే విధంగా కృషి చేస్తామన్నారు. రావులపల్లి చెరువులోకి వెళ్లే కాల్వ కోసం భూమి నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం అందజేయనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవసాయ రంగానికి నీటిని అందించడానికి ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్నారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు నిండాయని, దీంతో రైతాంగం సంతోషంగా ఉన్నారని అన్నారు. కాని జిల్లాలోని తుంగతుర్తి నియోజకవర్గంలో తుంగతుర్తి, నూతనకల్‌ మండలాలు, సూర్యాపేట నియోజకవర్గంలోని పెన్‌పహాడ్, మోతె, చివ్వెంల, కోదాడ నియోజకవర్గంలోని నడిగూడెం మండలాల్లో వర్షాలు పూర్తి స్థాయిలో కురవక చెరువులు, కుంటలు నిండలేదని అన్నారు. ఎస్సారెస్పీ రెండవ దశ కాలువల ద్వారా 69,70,71 డీబీఎమ్‌ల ద్వారా నీటిని సరఫరా చేసి ఆయా మండలాల్లోని చెరువులు, కుంటలు నింపడానికి వరంగల్‌ జిల్లా బయ్యన్న వాగు నుంచి వృథాగా పోతున్న నీటిని ఎస్సారెస్పీ కాలువలకు సరిపడా నీటిని విడుదల చేయాలని అధికారులను కోరారు. సుమారు 1500 క్యూసెక్కులు విడుదల చేయాలని కోరితే అధికారులు 600 క్యూసెక్కుల మేరకు నీటిని విడుదల చేయడం పట్ల మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. వృ«థాగా పోయే నీటిని చెరువులు నింపడానికి వదిలివేయమంటే ఎందుకు అంత నిర్లక్ష్యం చేస్తున్నారని అధికారులపై మండిపడ్డారు. ఈ సందర్భంగా పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌ రావు ఎస్సారెస్పీ అధికారులతో మాట్లాడి నీటి విడుదలకు వాగు వద్ద గేట్లను పైకిఎత్తించారు. వాగు నుంచి అలుగు బంద్‌ అయ్యేంతవరకు గేట్లను దించవద్దని అన్నారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గాదరి కిశోర్‌ కుమార్, పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌ రావు, తహసీల్దార్లు జగన్నాథరావు, పులి సైదులు, ఎంపీడీఓ వెంకటాచారి, మార్కెట్‌ కమిటీ చైర్‌ పర్సన్‌ పాశం విజయ యాదవరెడ్డి, వైస్‌ చైర్మన్‌ గుజ్జ యుగేంధర్‌ రావు, టీఆర్‌ఎస్‌వీ జిల్లా అద్యక్షులు కే.శోభన్‌బాబు, జెడ్పీటీసీలు వరలక్ష్మి, నర్సింగ్‌ నాయక్, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు గుడిపాటి సైదులు, రజాక్, దుగ్యాల రవీందర్‌ రావు, దాయం విక్రంరెడ్డి, కోడి శ్రీను, గుండగాని రాములు గౌడ్, వెంకటనారాయణ గౌడ్, తాటికొండ సీతయ్య, నల్లు రాంచంద్రారెడ్డి, బబ్బిసింగ్, గోపాల్‌ రెడ్డి, కృష్ణ,  తదితరులు పాల్గొన్నారు. 
 
మరిన్ని వార్తలు