నేడు ఆర్టీఏ కార్యాలయానికి రవాణాశాఖ మంత్రి

20 Jul, 2016 20:39 IST|Sakshi
తిమ్మాపూర్‌ : హరితహారంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు తిమ్మాపూర్‌లోని ఆర్టీఏ కార్యాలయానికి  రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి, రవాణా శాఖ కమిషనర్‌ సందీప్‌కుమార్‌ సుల్తానియా గురువారం రానున్నట్లు డీటీసీ వినోద్‌కుమార్‌ తెలిపారు. కార్యక్రమానికి కలెక్టర్, ఎస్పీ,  జెడ్పీ చైర్‌పర్సన్, జిల్లాలోని ఎమ్మెల్యేలు, నగర మేయర్‌ హాజరవుతారని పేర్కొన్నారు. మండలంలోని జెడ్పీటీసీ, ఎంపీపీ, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరుకావాలని కోరారు. 
 
ఏర్పాట్లలో అధికారులు..
ఆర్టీఏ ఆఫీస్‌లో మొక్కలు నాటే కార్యక్రమానికి రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి, కమిషనర్‌ సందీప్‌కుమార్‌ సుల్తానియా వస్తున్న సందర్భంగా డీటీసీ, ఎంవీఐలు, ఏఎంవీఐలు, కార్యాలయ ఉద్యోగులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. కార్యాలయ ఆవరణలో భూమి చదునుతోపాటు 500 మొక్కలు నాటేందుకు గుంతలు తవ్వకాన్ని పూర్తిచేశారు. మొక్కలు నాటిన అనంతరం నూతనంగా వేసిన బోరు మోటార్‌ను వారు ప్రారంభిస్తారని డీటీసీ వినోద్‌ పేర్కొన్నారు. కార్యాలయాన్ని చెట్లతో పచ్చగా ఉండేలా తయారుచేస్తామని తెలిపారు. ఎంవీఐలు కొండాల్‌రావు, శ్రీనివాస్, రవీందర్, కిషన్‌రావు, ఏఎంవీఐ రజనీబాయి తదితరులు పాల్గొన్నారు.
 
 
మరిన్ని వార్తలు