నేడు పల్స్‌పోలియో

29 Jan, 2017 00:31 IST|Sakshi
–2,771 కేంద్రాల ఏర్పాటు
–ఐదేళ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు
 
కర్నూలు(హాస్పిటల్‌): పల్స్‌పోలియో కార్యక్రమం ఆదివారం కర్నూలులో ప్రారంభమవుతుందని జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి(డీఐవో) డాక్టర్‌ వెంకటరమణ చెప్పారు. శనివారం డీఎంహెచ్‌వో కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐదేళ్లలోపు పిల్లలందరికీ విధిగా పోలియో చుక్కలు వేయించాలన్నార. ఈ కార్యక్రమంలో 29వ తేదిన పల్స్‌పోలియో బూత్‌లలో , 30, 31, ఫిబ్రవరి 1వతేదీల్లో ఇంటింటికి తిరిగి సిబ్బంది పిల్లలకు పోలియో చుక్కలు వేస్తారన్నారు. జిల్లాలో ఐదేళ్లలోపు పిల్లలు 5,31,684 మంది ఉన్నట్లు గుర్తించామన్నారు. వీరికి 6,20,000 డోసుల వ్యాక్సిన్‌ సిద్ధంగా ఉంచినట్లు పేర్కొన్నారు.
 
 పోలియో చుక్కలు వేసేందుకు జిల్లాలో 2,771 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. వీటితో పాటు ట్రాన్సిట్‌ బూత్‌లు 95, మొబైల్‌ బూత్‌లు 98 నియమించినట్లు తెలిపారు. ఈ మేరకు 11, 084 మంది సిబ్బంది పాల్గొంటారన్నారు. వీరితో పాటు 277 మంది సూపర్‌వైజర్లు పర్యవేక్షణ చేస్తారన్నారు. జిల్లాలో పనిచేసే కార్మికులు 5,236 మంది ఉండగా, అక్కడ ఉండే 1,358 మంది చిన్నారులపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. అన్ని రైల్వే, బస్‌స్టేషన్లు, అంతర్‌రాష్ట్ర చెక్‌పోస్టులు, సంతలు, జాతరలు, ప్రయాణాలలోని చిన్నారులకు పోలియో చుక్కలు వేసేందుకు 98 బృందాలు నియమించినట్లు చెప్పారు.  సమావేశంలో జిల్లా క్షయ నియంత్రణాధికారి డాక్టర్‌ మోక్షేశ్వరుడు, జిల్లా మలేరియా నియంత్రణాధికారి జె.డేవిడ్‌రాజు, ఆర్‌బీఎస్‌కే కో ఆర్డినేటర్‌ హేమలత, డెమో ఎర్రం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 
 
మరిన్ని వార్తలు