పెడన రూరల్, న్యూస్లైన్ : వైఎస్సార్ సీపీ పెడన నియోజకవర్గ సమన్వయకర్త వాకా వాసుదేవరావు ఆధ్వర్యాన బల్లిపర్రులో నిర్వహిస్తున్న వైఎస్సార్ మెమోరియల్ క్రికెట్ టోర్నీ ఫైనల్ మ్యాచ్ ఆదివారం ఉదయం 11గంటలకు ప్రారంభమవుతుంది. ఫైనల్లో గూడూరు మెయిన్ జట్టు, తోటమూల డేర్ డెవిల్స్ జట్టు తలపడనున్నాయి. ఫైనల్ మ్యాచ్కు, ముగింపు సభకు వీవీఆర్ ఫౌండేషన్ ప్రతినిధులు విస్తృత ఏర్పాట్లుచేశారు. ఈ టోర్నీలో విజేతకు రూ.50,116 నగదు బహుమతి, ట్రోఫీ అందజేస్తామని వాకా వాసుదేవరావు తెలిపారు.
ద్వితీయ స్థానం పొందిన జట్టుకు రూ.30, 116, మూడో స్థానంలో నిలిచిన జట్టుకు రూ.15,116, నాలుగో స్థానం సాధించిన జట్టుకు రూ.9,116 నగదు బహుమతులతోపాటు షీల్డ్లను అందజేస్తామని చెప్పారు. ముగింపు సభలో వైఎస్సార్ సీపీ కేంద్రపాలక మండలి సభ్యురాలు ఉప్పులేటి కల్పన పాల్గొని బహుమతులు అందజేస్తారని తెలిపారు. ఫైనల్ మ్యాచ్కు ముందు ఉదయం 8గంటలకు మూడు, నాలుగు స్థానాల కోసం లక్ష్మీపురం(పల్లెపాలెం) జట్టు, మెగా రాక్స్(కమలాపురం)జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుందని టోర్నీ ఆర్గనైజర్ చందు శ్రీనివాస్ తెలిపారు.