ధర్నాను విజయవంతం చేయండి

6 Apr, 2017 23:29 IST|Sakshi

అనంతపురం న్యూసిటీ : టీడీపీ ప్రభుత్వ అనైతిక చర్యలను నిరసిస్తూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శుక్రవారం అనంతపురం తహసీల్దార్‌ కార్యాలయం వద్ద చేపట్టబోయే ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. వైఎస్సార్‌ సీపీ తరపున గెలిచిన వారిని చంద్రబాబునాయుడు తన పార్టీలో చేర్చుకోవడం ఆయన దిగుజారుడుతనానికి నిలువెత్తు నిదర్శనమన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి రాజ్యాంగ విలువలను కాలరాశారన్నారు.

సీఎం తీరుపై వారి సొంత పార్టీలోనే పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయన్నారు. నీతి, నిజాయితీ, నిప్పు అని చెప్పే చంద్రబాబు ఇంతటి నీచానికి దిగజారడం దారుణమని ధ్వజమెత్తారు. తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిస్తే అది తప్పని చెప్పిన సీఎం, ఇక్కడ ఏ ముఖం పెట్టుకుని ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులిచ్చారని ప్రశ్నించారు. ఇప్పటికే ప్రజల్లో టీడీపీపై పూర్తిస్థాయిలో వ్యతిరేక వచ్చిందన్నారు. ఆ పార్టీని బంగాళాఖాతంలో కలిపే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని గురునాథ్‌రెడ్డి అన్నారు. టీడీపీ ప్రభుత్వ నీచ వైఖరిని ఎండగట్టేందుకు చేపట్టిన ధర్నాకు పార్టీ కార్యకర్తలు, నాయకులు, అనుబంధ సంఘాలవారు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు