నేడే పంచాయతీ ఉప ఎన్నికలు

7 Sep, 2016 21:55 IST|Sakshi
జిల్లాపరిషత్‌ : జిల్లాలో నిర్వహిస్తున్న పంచాయతీ ఉప పోరులో భాగంగా 3 సర్పంచ్, ఒక ఎంపీటీసీ, 3 వార్డుసభ్యుల స్థానాలకు ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు గురువారం ఎన్నికలను నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటల నుంచి ఒంటి గంట వరకు పోలింగ్, మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు ఉంటుందని డీపీవో కృష్ణమూర్తి తెలిపారు. జిల్లాలో వివిధ కారణాల వల్ల ఆకస్మికంగా ఏర్పడిన 1 ఎంపీటీసీ, 3 సర్పంచ్, 38 వార్డుసభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. బిచ్కుంద మండలం ఎల్లారం సర్పంచ్‌ స్థానానికి ఇద్దరు, నవీపేట్‌ మండలం బినోల సర్పంచ్‌ స్థానానికి ముగ్గురు, మద్నూర్‌ మండలం సుల్తాన్‌పేట్‌ సర్పంచ్‌ స్థానానికి ముగ్గురు అభ్యర్థులు బరిలో ఉండగా ఎన్నికల్లో వరుసగా 507, 2059, 928 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అలాగే 38 వార్డుస్థానాలకు గాను 32 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మూడు వార్డుసభ్యుల స్థానాలకు నామినేషన్లు రాలేవు. మరో మూడు వార్డు స్థానాలకు ఆరుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. అందులో దోమకొండ మండలం సంగమేశ్వర్‌లో 7వ వార్డుకు ఇద్దరు, లింగంపేట్‌ మండలంలోని భవానీపేట్‌లో 7వ వార్డుకు ఇద్దరు, ఎడపల్లి మండలంలోని పోచారంలో 7వ వార్డుకు ఇద్దరు అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
ముషీర్‌నగర్‌ ఎంపీటీసీ స్థానానికి..
కాగా సిరికొండ మండలంలోని ముషీర్‌నగర్‌ ఎంపీటీసీ స్థానానికి ముగ్గురు అభ్యర్థులు బరిలో ఉన్నట్లు జెడ్పీ సీఈవో మోహన్‌లాల్‌ తెలిపారు. ముషీర్‌నగర్, కొటాల్‌పల్లిలో రెండు పోలింగ్‌ స్టేషన్లను ఏర్పాటుచేశామని, 1,224 మంది ఓటర్లు ఓటుహక్కును వినియోగించుకోనున్నారని పేర్కొన్నారు. ఇద్దరు ప్రిసైడింగ్‌ ఆఫీసర్లు, 8 మంది సిబ్బందిని నియమించామన్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ ఉంటుందని, 10న కౌంటింగ్‌ ఉంటుందన్నారు. ఎన్నికల సందర్భంగా గ్రామంలో సెలవును ప్రకటించామని తెలిపారు. ఎన్నికలకు అన్ని ఏర్పాటు చేశామని, ఓటర్లు నిర్భయంగా ఓటింగ్‌లో పాల్గొనవచ్చని సూచించారు.
 
మరిన్ని వార్తలు