రేపే ‘పల్స్‌ పోలియో’

27 Jan, 2017 23:47 IST|Sakshi

అనంతపురం మెడికల్‌ : రెండు చుక్కలు మీ చిన్నారుల జీవితాన్ని పోలియో బారిన పడకుండా చేస్తాయి. వారి బంగారు భవిష్యత్‌కు బాటలు వేస్తాయి. ఆదివారం ‘పల్స్‌ పోలియో’ నిర్వహించనున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ సర్వం సిద్ధం చేసింది. ఇందులో భాగంగా శనివారం అనంతపురంలోని అవగాహన ర్యాలీ నిర్వహించనున్నారు. జిల్లాలో 4,50,545 మంది 0–5 ఏళ్లలోపు పిల్లలకు వ్యాక్సిన్‌ వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకుగాను 5,90,000 వ్యాక్సిన్లను పంపిణీ చేశారు.

విజయవంతం చేయండి
జిల్లా వ్యాప్తంగా ఈనెల 29న పల్స్‌పోలియో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ వెంకటరమణ తెలిపారు. అందరూ సమష్టిగా పని చేసి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. శుక్రవారం తన చాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 30, 31వ తేదీల్లో ఇంటింటికీ వెళ్లి పిల్లలకు పోలియో చుక్కలు వేస్తామని తెలిపారు.  పీహెచ్‌సీలు, సబ్‌ సెంటర్లకు ఇప్పటికే వ్యాక్సిన్లు అందజేశామన్నారు. అనంతపురంలోని కోర్టు రోడ్డులో ఉన్న నెహ్రూ నగరపాలకోన్నత పాఠశాలలో కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. ఇందులో భాగంగా శనివారం అనంతపురంలో ర్యాలీ చేపడతామన్నారు. అనంతరం పల్స్‌పోలియోకు సంబంధించి పోస్టర్లను విడుదల చేశారు.

మరిన్ని వార్తలు