వరంగల్ బరిలో మాజీ స్పీకర్ మీరాకుమార్!

1 Aug, 2015 15:13 IST|Sakshi
వరంగల్ బరిలో మాజీ స్పీకర్ మీరాకుమార్!

హైదరాబాద్: డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి రాజీనామాతో ఉప ఎన్నిక అనివార్యమైన వరంగల్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేయబోయే కాంగ్రెస్ అభ్యర్థి విషయంలో అనూహ్యపరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఓవైపు మాజీ ఎంపీలు రాజయ్య, వివేక్, సర్వే సత్యనారాయణ సహా పలువులు ఎస్సీ నేతల పేర్లు పరిశీలనలో ఉండగానే.. వరంగల్ నుంచి లోక్సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ను పోటీలోకి దించాలని టీపీసీసీ భావిస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.

ఇదే విశయాన్ని హైకమాండ్తో చర్చించేందుకే టీపీసీసీ చీఫ్ ఉత్తమ కుమర్ రెడ్డి శనివారం ఢిల్లీకి పయనమయ్యారని పార్టీ వర్గాలు చెప్పాయి. దీంతోపాటు ఈ నెలలో నిర్వహించనున్న రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన షెడ్యూల్, రూట్ మ్యాప్ తదితర వివరాలపైనా ఆయన హైకమాండ్ తో మాట్లాడతారని తెలిసింది. కాంగ్రెస్ పార్టీలో తొలితరం దళిత నేతగా ఎనలేని కీర్తిప్రతిష్ఠలు పొందిన బాబూ జగజ్జీవన్ రామ్ తనయగా, గత లోక్సభ స్పీకర్గా సమర్థతను నిరూపించుకున్న నాయకురాలిగా మీరా కుమార్ కు కూడా దేశవ్యాప్త గుర్తింపు ఉంది. అయితే ఆమె ఎంపిక తెలంగాణలో కాంగ్రెస్కు మళ్లీ జవసత్వాలు తెచ్చిపెడుతుందా లేదా అనేది ఉప ఎన్నికలు ముగిశాకగానీ వెల్లడికాదు.

మరిన్ని వార్తలు