-

సిద్దిపేటలో ట్రా‘ఫికర్‌’

30 Jul, 2016 20:02 IST|Sakshi
పట్టణంలో పర్యటిస్తున్న డీఐజీ అకున్‌ సబర్వాల్‌
  • పట్టణంలో ట్రాఫిక్‌ నియంత్రణకు చర్యలు
  • ఆరు జంక్షన్లు, రెండు వన్‌వే రహదారులు, మూడు ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణం
  • పట్టణంలో డీఐజీ పర్యటన
  • సిద్దిపేట రూరల్‌: సిద్దిపేట పట్టణంలో ట్రాఫిక్‌ ఇబ్బందులకు చెక్‌ పెట్టనుంది. వాహనదారులు ఇక పట్టణంలో ఎలాంటి ట్రా‘ఫికర్‌’ లేకుండా సాఫీగా వెళ్లిపోవచ్చు. పట్టణంలో నెలకొంటున్న ట్రాఫిక్‌ సమస్యలకు శాశ్వత పరిష్కారం చేసేందుకు రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక దృష్టి సారించారు.

    ఈ నేపథ్యంలో శనివారం డీఐజీ అకున్‌ సబర్వాల్‌ పట్టణంలో పర్యటించారు. పట్టణంలోని పలు రహదారుల్లో తిరిగి పరిశీలించారు. ట్రాఫిక్‌ ఇబ్బందులు ఉన్న ప్రదేశాలను గుర్తించారు. ఈ సందర్భంగా సమగ్ర పట్టణాభివృద్ధితో పాటు పలు చోట్ల జంక్షన్ల అభివృద్ధి చేపట్టేందుకు కావాల్సిన ప్రణాళికను ఏర్పాటు చేశారు.

    ఇదిలా ఉంటే ఈ నెల 23న మున్సిపల్‌, పోలీసు, రవాణా శాఖ ఉన్నతాధికారుల బృందం పర్యటించన విషయం తెలిసిందే. సిద్దిపేట జిల్లా కానున్న నేపథ్యంలో పట్టణంలో ట్రాఫిక్‌ నియంత్రణ, రహదారుల భద్రత, వాహనదారులు, పాదాచారుల సౌకర్యం తదితర అంశాలపై డీఐజీతో పాటు ట్రాఫిక్‌ సీఐ వెంకటేశం, టౌన్‌ సీఐ సురేందర్‌రెడ్డిలతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. దీనిపై ‘సాక్షి’ కథనం...

    ఆరు జంక్షన్లు
    పట్టణంలో ట్రాఫిక్‌ నియంత్రణకు ఆరు జంక్షన్ల ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధమైంది. పట్టణంలోని అంబేద్కర్‌ సర్కిల్‌, రూరల్‌ పోలీసు స్టేషన్‌ సర్కిల్‌, వేములవాడ కమాన్‌ సర్కిల్‌, కాంచీట్‌ సర్కిల్‌, నర్సాపూర్‌ సర్కిల్‌, విక్టరీ టాకీస్‌ సర్కిళ్లను విస్తరించనున్నారు. అలాగే ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం కలుగకుండా సిగ్నళ్లు ఉన్న చోట ఫ్రీలెఫ్ట్‌, యూటర్న్‌ను ఏర్పాటు చేయనున్నారు. దీంతో ఏ కూడలి వద్ద నేరుగా వాహనాలు రోడ్డు దాటే అవకాశం ఉండదు.

    నిబంధనల ప్రకారం కొంత దూరం వెళ్లి యూటర్న్‌ తీసుకోవాల్సి ఉంటుంది. దీని కోసం జంక్షన్ల వద్ద డివైడర్లను ఏర్పాటు చేయడంతో పాటు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సెంట్రల్‌ మీడియన్ల ఎత్తు పెంపు చేపడుతున్నారు. పట్టణంలో పాదాచారులకు, వాహనదారుల సౌకర్యార్థం లైన్‌ మార్కింగ్‌లు, ఫుట్‌పాత్‌ తదితర పనులు చేపట్టనున్నారు. అదే విధంగా పట్టణంలోని సుభాష్‌రోడ్డును, కాంఛీట్‌ చౌరస్తా నుంచి వీరసావర్కర్‌ వరకు వన్‌వే కానుంది.

    మూడు ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిలు
    పట్టణంలో ఉన్న ట్రాఫిక్‌ను దృష్టిలో పెట్టుకుని మూడు ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిలు నిర్మాణం చేపట్టిందుకు కార్యచరణ రూపొందించారు. హైదారాబాద్‌ తరహాలో వీటి నిర్మాణాలు జరగనున్నాయి. రద్దీ ప్రాంతాల్లో రోడ్డు దాటేందుకు మహిళలు, చిన్నారులు, వృద్ధులు ఇబ్బందులు పడకుండా ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జిలను నిర్మించనున్నారు.

    ఇందు కోసం పట్టణంలోని పాత బస్టాండ్‌-అంబేద్కర్‌ సర్కిల్‌, హైదారాబాద్‌ రోడ్డులో, మెదక్‌ రోడ్డులోని మల్టీ పర్పస్‌ హైస్కూల్‌ సమీపంలో ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిల నిర్మాణం జరగనుంది. దీంతో ట్రాఫిక్‌ ఇబ్బం‍దులు లేకుండా పాదాచారులు రోడ్డు దాటేందుకు వీలుంటుంది.

    ఎంక్రోచ్‌మెంచ్‌ రోడ్‌ మార్కింగ్‌
    పట్టణ అవసరాలకు అనుగుణంగా జంక్షన్‌ విస్తరణ, యూటర్న్‌లు, రోడ్‌ మార్కింగ్‌లు, ఫ్రీకాస్ట్‌ డివైడర్ల ఏర్పాటు, సెంట్రల్‌ మీడియన్ల ఎత్తు అవసరాల తగ్గట్టు పెంచడం, విద్యుత్‌ స్తంబాల వంటివి అడ్డుగా ఉంటే వాటిని పక్కకు తరలించడం, థర్మో పాస్టిక్‌ పెంయింటింగ్‌ వేయడం, ఫుట్‌పాత్‌ అభివృద్ధి తదితర కార్యక్రమాలు చేపట్టనున్నారు.

    ప్రత్యేకించి రద్ధీగా ఉండే సుభాష్‌రోడ్‌లో పార్కింగ్‌ సదుపాయం కల్పించేలా చర్యలు, రోడ్‌ మార్కింగ్‌, బస్సు ఆపే ప్రదేశాలు, కార్లు నిలపే ప్రదేశాలు, ఆటో స్టాండ్లు తదితరు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టి అవసరమైన మేర క్రమబద్దీకరణ చేపట్టనున్నారు.

    20 యాక్సీడెంట్‌ జోన్‌లు
    సిద్దిపేట పట్టణ శివారు రహదారుల్లో 20 ప్రాంతాలు యాక్సీడెంట్‌ జోన్‌లుగా గుర్తించారు. పొన్నాల దాబాల చౌరస్తా, రంగీలా దాబా చౌరస్తా, రంగధాంపల్లి చౌరస్తా, నాగదేవత గుడి సమీపంతో పాటు తదితర ప్రాంతాలు ప్రమాదాలకు నెలవుగా మారాయి. ఈ ప్రాంతాల్లో ప్రమాదాలు జరగకుండా నియంత్రించేందుకు చర్యలు తీసుకోనున్నారు. ఆయా ప్రాంతాల్లో  ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏర్పాటు చేయనున్నారు.

మరిన్ని వార్తలు