విషాదం

9 May, 2017 22:05 IST|Sakshi
విషాదం
- రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం
- మరో ఇద్దరికి గాయాలు
- విందు చేసుకుని వస్తుండగా ప్రమాదం
- మద్యం సేవించారని పోలీసుల అనుమానం
  
గోనెగండ్ల/కల్లూరు: కర్నూలు - బళ్లారి రహదారిపై ఎస్‌. లింగందిన్నె గ్రామ స్టేజీ వద్ద మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. కల్లూరుకు చెందిన శ్రీనివాసులు ఇటీవల కొత్త ఇన్నోవా వాహనం కొనుగోలు చేశారు. మంగళవారం ఉదయం అతనితోపాటు ముగ్గురు మిత్రులు,  డ్రైవర్‌ దేవనకొండ వైపు వెళ్లినట్లు తెలుస్తోంది. తిరిగి వచ్చే సమయంలో గోనెగొండ్ల మండలం లింగందిన్నె స్టేజీ వద్ద వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కల్లూరు ఎస్టేట్‌కు చెందిన మల్లికార్జున(42), దూపాడుకు చెందిన వాహన డ్రైవర్‌ మోహన్‌(27 ) అక్కడికక్కడే మృతి చెందారు. శ్రీనివాసులు, నాగిరెడ్డి, ఆల నాగిరెడ్డికి తీవ్ర గాయాలు కావడంతో కర్నూలుకు తరలించారు.
 
పెద్దటేకూరు గ్రామానికి చెందిన ఆల నాగిరెడ్డి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఆల నాగిరెడ్డి, మృతునికి భార్య మంజుల, కుమారులు సాయిచరణ్, గౌరు చరణ్, కుమార్తె ప్రవళ్లిక సంతానం. ప్రమాద వార్త తెలుసుకున్న పాణ్యం నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జ్‌ ఏరాసు ప్రతాప్‌ రెడ్డి, మండల నాయకులు, గ్రామ పెద్దలు, ప్రజలు పెద్ద ఎత్తున కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలివచ్చారు. ఘటన స్థలాన్ని ఎస్‌ఐ కృష్ణమూర్తి పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నలుగురు స్నేహితులతో పాటు డ్రైవర్‌ ఈదులదేవరబండ వద్ద విందు చేసుకుని తిరిగి వస్తుండగా ప్రమాదం చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అతిగా మద్యం సేవించి వాహనం నడపడటంతోనే వాహనం అదుపు తప్పి బోల్తా పడినట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. 
 
మరిన్ని వార్తలు