విహార యాత్రలో విషాదం

19 Mar, 2017 23:43 IST|Sakshi
వెలుగోడు: సెలవు దినం కావడంతో కుటుంబ సభ్యులు అంతా విహారయాత్రకు వెలుగోడు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌కు వెళ్లగా విషాదం చోటు చేసుకుంది. వారి ఇళ్లలో ఏదైనా వివాహం జరిగితే అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి ఏదైనా ఒక ప్రాంతానికి వెళ్లి సంతోషంగా గడపటం ఆనవాయితీగా వస్తుంది. ఈ క్రమంలో పట్టణానికి చెందిన ఇనాయతుల్లా కుటుంబం ఆదివారం వీబీఆర్‌ పరిధిలో మద్రాస్‌ కాల్వ వద్దకు వెళ్లారు. ఈ సమయంలో ఇనాయతుల్లా కుమారుడు ముక్కరం(14) ఈత కొడుతూ ప్రమాదశాత్తూ లోతైన గుంతలో ఇర్కుకొని ఊపిరి ఆడక మృత్యువాత పడ్డాడు. అక్కడే ఉన్న కుటుంబ సభ్యులు ఎంత ప్రయత్నించి ఫలితం దక్కలేదు. ఈ ఘటన పట్టణంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అలాగే ఉరుసు సమయం కావడంతో వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చిన బంధువులు వీబీఆర్‌ వద్ద విహార యాత్రకు వచ్చారు. ఇలాంటి తరుణంలో ముక్కరం మృత్యువాత స్థానికులను కలవరానికి గురి చేసింది. విద్యార్థి స్థానిక మోడల్‌ స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్నాడు. ఇనాయతుల్లా దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె సంతానం కాగా ఉన్న కుమారుడు మృత్యువాత పడటంతో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు.  
 
మరిన్ని వార్తలు