-

చెల్లింపులకు బ్రేక్‌

20 Feb, 2017 23:57 IST|Sakshi
చెల్లింపులకు బ్రేక్‌
నిలిచిపోయిన రూ.100 కోట్ల బిల్లులు
ఆరో తేదీ నుంచి ఇదే పరిస్థితి
ఖాతాలను ఫ్రీజ్‌ చేసిన ప్రభుత్వం
సాంకేతిక సమస్యే కారణమంటున్న అధికారులు
ఆందోళన చెందుతున్న ఉద్యోగులు
 
పుష్కరాలు, మహిళా పార్లమెంటేరియన్‌ సదస్సు వంటి కార్యక్రమాలకు కోట్లాది రూపాయలు మంచినీళ్లలా ఖర్చు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఉద్యోగుల విషయానికి వచ్చేసరికి మాత్రం మొండిచేయి చూపుతోంది. ఆర్థిక లోటు ఉందంటూ వారికి సంబంధించిన వివిధ బిల్లులు చెల్లించేందుకు నిరాకరిస్తోంది. పలు ఖాతాలను సర్కారు ఫ్రీజ్‌ చేయడంతో జిల్లాలో దాదాపు రూ.100 కోట్ల చెల్లింపులు నిలిచిపోయాయి. దీనిపై ఉద్యోగులు మండిపడుతున్నారు.
 
రామచంద్రపురం రూరల్‌ : జిల్లా ఖజానా కార్యాలయంలో చెల్లింపులకు బ్రేక్‌ పడింది. ఆర్థిక లోటు పేరుతో వివిధ ఖాతాలను ప్రభుత్వం ఫ్రీజ్‌ చేయడంతో ఈ నెల 6వ తేదీ నుంచి పలు హెడ్‌ అకౌంట్ల ద్వారా చెల్లింపులు నిలిచిపోయాయి. ఇప్పటివరకూ జిల్లావ్యాప్తంగా సుమారు రూ.100 కోట్ల మేర చెల్లింపులు నిలిచిపోయాయి. ఉద్యోగులకు సంబంధిం చిన వివిధ బిల్లులతోపాటు, ఆర్థిక అవసరాల కోసం పెట్టుకున్న బిల్లులను కూడా నిలిపివేశారు. సరెండర్‌ లీవ్, టీఏ, కార్యాలయ నిర్వహణ, సప్లిమెంటరీ జీతాలు, జీపీఎఫ్, విద్యార్థుల స్కాలర్‌షిప్, అంగన్‌వాడీ వేతనా లు తదితర వాటికి సంబంధించిన బిల్లులు నిలిచిపోయిన వాటి లో ఉన్నాయి. దీంతో ఆయా వర్గాలవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వివిధ కార్యక్రమాలకు అధిక మొత్తంలో డబ్బులు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం తమవరకూ వచ్చేసరికి ఈవిధంగా వ్యవహరించడం సరికాదని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు వచ్చినపుడు ఉద్యోగులు తమ ఆర్జిత సెలవులను ప్రభుత్వానికి సరెండర్‌ చేసి సొమ్ము తీసుకుంటారు. అయితే ప్రభుత్వం ప్రస్తుతం వీటి చెల్లింపులు కూడా నిలిపివేసింది. టీఏ బిల్లుల పరిస్థితి కూడా ఇంతే. ప్రభుత్వ కార్యక్రమాలకు ఉద్యోగులు సొంత ఖర్చుతో హాజరై, ధించిన బిల్లులు పెట్టుకుంటారు. వీటి చెల్లింపులను కూడా నిలిపివేశారు. కార్యాలయ నిర్వహణ బిల్లులను కూడా నిలిపివేయడంతో పరిస్థితి ఇబ్బందికరంగా మారనుందని ఉద్యోగులు, అధికారులు ఆందోళన చెందుతున్నారు. అంగన్‌వాడీ వేతనాలను కూడా కార్యాలయ నిర్వహణ పద్దు నుంచి ఇస్తారు. వీటిని కూడా నిలిపివేశారు.
 
మరిన్ని వార్తలు