టీఆర్‌ఎస్‌ సమావేశం రసాభాస

30 Aug, 2017 17:20 IST|Sakshi

సాక్షి, మధిర(ఖమ్మం జిల్లా): అధికార పార్టీ మధిర నియోజకవర్గ స్థాయి సమావేశంలో కార్యకర్తలు కుర్చీలతో కొట్టుకున్నారు. మధిర రెడ్డిగార్డెన్ ఫంక‌్షన్ హాల్‌లో బుధవారం టీఆర్‌ఎస్‌ నియోజకవర్గస్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు పూర్తిగా అమలు జరగాలంటే కార్యకర్తలు సమర్థవంతంగా పనిచేయాలని ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరావు అన్నారు.

జిల్లా పార్టీ అధ్యక్షుడు బేగ్ మాట్లాడుతూ.. వేరే పార్టీల నుంచి వచ్చిన కొందరు అభివృద్ధి జరగటంలేదని అనటం సరికాదని, ఇష్టం లేనివారు బయటకు వెళ్లవచ్చని అనడంతో సమావేశంలో కలకలం రేగింది. కొందరు వాగ్వాదానికి దిగారు. కుర్చీలు విసురుకున్నారు. తాము లేకుండానే నాయకులు అయ్యారా అంటూ ఆరోపణలకు దిగారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు బేగ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీనిపై ఎంపీ పొంగులేటి జోక్యం చేసుకుని వారికి సర్దిచెప్పి సముదాయించారు. అనంతరం సమావేశం కొనసాగింది.

మరిన్ని వార్తలు