కేసీఆర్‌ది తుగ్లక్‌ పరిపాలన

19 Jul, 2016 17:48 IST|Sakshi
కేసీఆర్‌ది తుగ్లక్‌ పరిపాలన

కార్పొరేట్‌ విద్యను దూరం చేస్తామని చెప్పారు.
కేజీ టూ పీజీ విద్య ఏమైంది?
వారం రోజుల్లో విద్యారంగ సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమిస్తాం
ఆగస్టు మొదటి వారంలో సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తాం
టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు చిల్కా మధుసూదన్‌రెడ్డి

వికారాబాద్‌ రూరల్‌ : రాష్ట్రంలో కేసీఆర్‌ తుగ్లక్‌ పరిపాలన కొనసాగిస్తున్నారని టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు చిల్కా మధుసూదన్‌రెడ్డి విమర్శించారు. విద్యారంగ సమస్యలపై టీఎన్‌ఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో మంగళవారం పెద్దఎత్తున విద్యార్థులతో పట్టణంలో ర్యాలీ నిర్వహించి సబ్‌కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చి ఇప్పుడు ఏమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారన్నారు. విద్యార్థులకు స్కాలర్‌షిప్స్‌ అందజేస్తానని, లక్ష ఉద్యోగులు సంవత్సరానికి ఇస్తామని మరిచిపోయారన్నారు. ప్రతి ఇంటికీ ఒక ఉద్యోగం కల్పిస్తామని, కల్లబొల్లి మాటలు చెప్పరని విమర్శించారు. విద్యార్థులను బిచ్చగాళ్లలా చూస్తున్నారని, వారికి రావాల్సిన డబ్బులను విడతల వారీగా ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఆత్మబలిదానాలు చేసుకున్న విద్యార్థులను మరిచిపోయి.. సమైక్యవాదం తెలిపిన వారిని మంత్రి పదవుల్లో కూర్చోబెట్టిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఇదేనా బంగారు తెలంగాణ అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కార్పొరేట్‌ విద్యను దూరం చేసి కేజీ టూ పీజీ విద్యను ప్రవేశపెడతానని చెప్పి.. ఎర్రవల్లి గ్రామం, ఫౌంహౌస్‌కే పరిమితమయ్యారన్నారు. దళితులకు మూడెకరాల భూమి అన్నారు.. లక్ష్య ఉద్యోగాలు అన్నారు..ఽ కేజీటూ పీజీ అన్నారు.. త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్‌ అన్నారు.. కానీ ఏ ఒక్క హామీని నెరవేర్చలేక పోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదిగో డీఎస్సీ.. ఇదిగో డీఎస్పీ.. అంటూ నోటిఫికేషన్‌ మాత్రం విడుదల చేయడం లేదని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతిగృహాల్లో అనేక సమస్యలు పేరుకుపోయాయని, వాటిని పరిష్కరించాలని, వాటిలో కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. ప్రస్తుతం రాష్ట్రం అవినీతి ముసుగులో కూరుకుపోయిందని, అధికారులు అవినీతికి దూరంగా ఉండాలన్నారు. ఎప్పుడు చూసినా మిషన్‌ కమిషన్‌ కాకతీయ, భగీరథ అంటున్న శ్రద్ధ చూపుతున్న సీఎం.. విద్యారంగ సమస్యలపై ఎందుకు చూపడం లేదన్నారు. డిగ్రీ కళాశాలలో కొత్తగా ప్రవేశపెట్టిన ఆన్‌లైన్‌ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కాబోయే వికారాబాద్‌ జిల్లా కేంద్రంలో మెడికల్‌ కాలేజీ, డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసి విద్యారంగాన్ని అభివృద్ధి చేయాలని కోరారు. విద్యారంగ సమస్యలను పరిష్కరించకపోతే టీఎన్‌ఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో ఆగస్టు మొదటి వారంలో 50 వేల మంది విద్యార్థులతో సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో టీఎన్‌ఎస్‌ పశ్చిమ జిల్లా అధ్యక్షుడు రంగరాజ్‌, పట్టణ టీడీపీ అధ్యక్షుడు ఉమాశేఖర్‌, జిల్లా కార్యదర్శి గొడుగు పాండు, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నియోజకవర్గ అధ్యక్షుడు దేవేందర్‌, విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు