వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం

5 Sep, 2017 21:39 IST|Sakshi
వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం

జిల్లాలో వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఒకరు కర్ణాటకకు చెందిన వారు ఉన్నారు.

ఓడీ చెరువు: వేలూరుకు చెందిన గరికముక్క రాము, స్వరూప దంపతులు మంగళవారం ఉదయం కర్ణాటకలోని బెంగళూరు నుంచి అద్దె కారు తీసుకుని స్వగ్రామానికి బయల్దేరారు. ఓడీ చెరువు మండలం దాదిరెడ్డిపల్లి సమీపాన కదిరి వైపు నుంచి వస్తున్న సిమెంటు లారీని ఢీకొంది. కారు ముందుభాగం లారీ కిందకు దూసుకుపోవడంతో బెంగళూరుకు చెందిన కారుడ్రైవర్‌ ఎం.హెచ్‌.దొరస్వామి (45) ఇరుక్కుపోయాడు. వెనుక సీట్లో కూర్చున్న దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. ఎస్‌ఐ సత్యనారాయణ పోలీసు సిబ్బంది, స్థానికుల సహాయంతో హుటాహుటిన క్షతగాత్రులను 108 వాహనంలో కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ దొరస్వామి మృతి చెందాడు. గరికముక్క రాము, స్వరూపలు చికిత్స పొందుతున్నారు.

ఎడ్లబండిని ఢీకొని మరొకరు..
కణేకల్లు: పులచెర్లకు చెందిన సంజీవప్ప (48) తన స్నేహితుడు హనుమంతప్పతో కలిసి సోమవారం రాత్రి 9.30 గంటలకు ద్విచక్రవాహనంలో కణేకల్లుక్రాస్‌ నుంచి స్వగ్రామానికి బయల్దేదేరాడు. పుల్లంపల్లి గ్రామం దాటాక ఎదురుగా వస్తున్న ఓ లారీకి సైడిస్తూ ముందుకుసాగాడు. లారీ లైట్ల వెలుతురులో లారీ వెనుకాలే ఉన్న ఎడ్లబండిని గమనించక ఢీకొట్టాడు. బలమైన దెబ్బలు తగిలి సంజీవప్ప అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన హనుమంతప్పను స్థానికులు బళ్లారి విమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు