నేరేడ్మెట్: నేరేడ్మెట్ రామకృష్ణాపురం చెరువులో ఆత్మహత్య చేసుకున్న ఇద్దరు యువతుల మిస్టరీ వీడింది. మృతులలో ఒకరి ప్రేమ వ్యవహారమే ఆత్మహత్యలకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు, స్థానికులు తెలిపిన మేరకు.. మౌలాలి తిరుమల నగర్కు చెందిన చిరంజీవి, పద్మావతి దంపతుల కుమార్తె మౌనిక (20) ఘట్కేసర్లోని అరోరా ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి ప్రాంతానికి చెందిన బ్రహ్మానందశర్మ, వల్లికాదేవిల కూతురు సౌమ్య రాజేశ్వరి (19) దిల్సుక్నగర్ కొత్తపేట చైతన్య కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది.
పద్మావతి, వల్లిక దేవిలు అక్కాచెళ్లెల్లు. మృతులలో ఒకరైన సౌమ్య రాజేశ్వరి తల్లిదండ్రులు గతంలోనే చనిపోవడంతో జీడిమెట్లలో ఉంటున్న పెద్దనాన్న చిరంజీవి వద్ద ఉంటుంది. ఆరోగ్యం బాగా లేకపోవడంతో సౌమ్య రాజేశ్వరి రెండు రోజుల క్రితం మౌలాలిలోని మౌనిక ఇంటికి వచ్చింది. గురువారం రాత్రి సమయంలో ఇద్దరు కలిసి నాచారం హెచ్ఎంటీ నగర్లోని బంధువుల ఇంటికి వెళుతున్నామని చెప్పి వెళ్లారు. శుక్రవారం మధ్యాహ్నం నేరేడ్మెట్ ఆర్కెపురం చెరువులో మృతదేహాలుగా కనిపించారు. వీరి వద్ద సూసైడ్నోట్లు పోలీసులు స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. తమ మరణానికి వేధింపులే కారణమని నోట్లో తెలిపారు. మౌనిక రాసిన నోట్లో కామేష్ అనే వ్యక్తి తనను బ్లాక్ మెయిల్ చేస్తూ వేధింపులకు గురి చేస్తున్నాడని, శాడిస్టుగా మారి తన జీవితాన్ని నాశనం చేస్తున్నాడని తాను ప్రేమించిన నాగార్జునను దూరం చేశాడని పేర్కొంది.
ప్రస్తుతం నాగార్జునకు వేరే అమ్మాయితో వివాహం కాబోతోందని తెలియడంతో పాటు కామేష్ తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని ఇందుకు తనకు జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పింది. ఇదిలా ఉండగా మరో మృతురాలు సౌమ్య రాజేశ్వరి తనకు అమ్మానాన్నలు లేరని బంధువుల వద్ద ఉంటూ వారి వేధింపులకు గురవుతున్నానని దీంతో జీవితంపై విరక్తి కలగడంతో పాటు సోదరి మౌనికతో పాటు కలసి చనిపోవాలని నిర్ణయించుకున్నానని తెలిపింది. దీంతో పోలీసులు మౌనికను ప్రేమించిన నాగార్జున అలియాస్ నానిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
తాను మౌనికను ప్రేమించిన మాట వాస్తవమేనని ప్రస్తుతం దూరంగా ఉంటున్నానని ఆత్మహత్యకు తాను కారణం కాదని పోలీసులకు తెలిపినట్లు తెలిసింది. నాగార్జున, మౌనికల ప్రేమ విషయంలో మధ్య వర్తిగా వచ్చిన కామేష్ ఇద్దరినీ దూరంగా ఉంచేందుకు ఓ ఒప్పంద పత్రం సైతం రాయించినట్లుగా తెలిసిం ది. ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న కామేష్ పరారిలో ఉన్నాడు. శనివారం మృతదేహాలకు పోస్ట్ మార్టం జరిగింది. ఆదివారం మౌలాలి తిరుమలనగర్లో అంత్యక్రియలు జరగనున్నాయి.