బంజారాహిల్స్: శ్రీనగర్కాలనీలోని పంజాబ్ నేషనల్ బ్యాంకు ఏటీఎంలోని డాటాను దొంగిలించేందుకు యత్నిస్తూ ఇద్దరు ఉన్నత విద్యావంతులు పోలీసులకు చిక్కారు. బంజారాహిల్స్ పోలీసుల కథనం ప్రకారం... విజయవాడ గాయత్రినగర్కు చెందిన యండ్రపల్లి ఆదిత్య(24) బీబీఏ.., విజయవాడ నెహ్రూనగర్కు చెందిన తెల్లా సతీష్(29) బీటెక్ పూర్తి చేశారు.
బేగంపేట కుందన్ బాగ్లో ఫ్లాట్ అద్దెకు తీసుకొని ఉంటున్న వీరిద్దరూ ఈనెల 4న శాలివాహననగర్ ఆర్బీఐ క్వార్టర్స్ దగ్గర ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంకులోకి ప్రవేశించి తమ వద్దనున్న సాంకేతిక పరిజ్ఞానంతో ఏటీఎంలోని డాటాను సేకరించేందుకు యత్నిస్తుండగా సెక్యూరిటీ గార్డ్ గమనించడంతో పరారయ్యారు. సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు ఆదిత్య, సతీష్లను అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి ల్యాప్టాప్, ఐపాడ్, త్రీడీ స్కానర్,రిఫ్లెక్టివ్ షీట్, మొబైల్ ఫోన్లు, కారును స్వాధీనం చేసుకున్నారు.
గతంలో వీరిద్దరూ ఏటీఎం సెంటర్లోకి ప్రవేశించి క్లోన్డ్ ఏటీఎం కార్డులు వినియోగించి డబ్బు డ్రా చేశారు. ఈ కేసులో 2014 జూన్ లో పోలీసులు ఇద్దరినీ అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. జైలు నుంచి బయటకు వచ్చాక వీరు మళ్లీ పాత దందానే కొనసాగిస్తున్నారు. ఏటీఎం కార్డులు క్లోనింగ్ చేస్తూ త్రీడీ స్కానర్తో డాటా క్యాప్చర్ చేసి డబ్బు డ్రా చేస్తున్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంకులో కూడా ఈ తరహాలోనే డాటా చోరీకి యత్నిస్తూ పట్టుబడ్డారు. గతంలో వీరిపై చైతన్యపురి, బేగంపేట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. నిందితులను అరెస్టు చేసి బుధవారం రిమాండ్కు తరలించారు.