మంచిర్యాల: జిల్లాలోని లక్సెట్టిపేటలో ర్యాగింగ్ కలకలం రేగింది. జూనియర్స్ సీనియర్స్తో మాట్లాడకూడదని షరతులు విధించడంతో.. మనస్తాపానికి గురైన ఇద్దరు జూనియర్ విద్యార్థినులు ఆత్మహత్యాయత్నం చేశారు. ఇదేదో ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన ఘటన కాదు. ఓ గురుకుల పాఠశాలలో వెలుగుచూసిన దారుణం. పాఠశాల స్థాయిలోనే ర్యాగింగ్ భూతం వెలుగు చూడటంతో స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
పట్టణంలోని సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న శరీష(14), సాయి నిధి(13) అక్కడ ఉంటున్న తొమ్మిదో, పదో తరగతి విద్యార్థినులతో చనువుగా ఉండేవారు. ఇది నచ్చని ఓ తొమ్మిదో తరగతి విద్యార్థిని సంధ్య వీరిని మందలించింది. సీనియర్స్తో మాట్లాడకూడదని ఆంక్షలు విధించింది. దీంతో మనస్తాపానికి గురైన ఇద్దరు విద్యార్థినులు యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. విషయం తెలుసుకున్న గురుకుల సిబ్బంది శనివారం ఉదయం వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. విద్యార్థినుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.