మైసూరులో రెండేళ్ల చిన్నారి హత్య

21 Oct, 2016 23:02 IST|Sakshi

– అవయవాలను వేరు చేసిన హంతకులు
మైసూరు (కర్ణాటక) : రాచనగరి మైసూరులో దారుణం చోటుచేసుకుంది. రెండేళ్ల వయసున్న గుర్తు తెలియని చిన్నారిని దుండగులు దారుణంగా హత్య చేశారు. తల, కాలు, చేయి వేరు చేసి చెత్తకుప్పల్లో పడేసి వెళ్లారు. ఈ ఉదంతం గురువారం రాత్రి వెలుగు చూసింది. ఎన్‌ఆర్‌ మోహల్లా పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నగరంలోని గాంధీనగర సమీపంలో కుక్కలు మానవ శరీర అవయవాలను పీక్కుతింటూ పోట్లాడుకుంటుండగా స్థానికులు గమనించారు.

కుళ్లిన స్థితిలో మానవ అవయవాలు కనిపించడంతో పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నిశితంగా పరిశీలించారు. చిన్నారిని హత్య చేసి తల, కాళ్లు, చేతులు వేరు చేసినట్లు గుర్తించారు. బాలుడా లేక బాలికా అనేది కూడా గుర్తు పట్టకుండా సున్నిత ప్రదేశంలో అత్యంత కిరాతకంగా కత్తులతో పొడిచినట్లు పోలీసుల పరిశీలనలో తేలింది. అనంతరం అవయవాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక కేఆర్‌ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు