వెంకటాచలం : మండలంలోని సర్వేపల్లి రిజర్వాయర్లో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని మత్స్యకారులు బుధవారం గుర్తించారు. జోసఫ్పేట సమీపంలోని గుమ్మళ్లదిబ్బ వద్ద రిజర్వాయర్లో మత్స్యకారులకు మృతదేహం కనిపించిందని మూడు రోజుల నుంచి పుకార్లు వచ్చాయి. మృతదేహాన్ని ఎవరు చూశారనే విషయంపై స్పష్టత లేకపోవడంతో వదంతులని కొట్టి పారేశారు. అయితే బుధవారం తెల్లవారు జామున చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు వ్యక్తి మృతదేహం నీటిపై తేలియాడుతూ కనిపించింది. ఈ విషయాన్ని మత్స్యకారులు తెలియజేయడంతో పోలీసులు అక్కడికి వెళ్లి పరిశీలించారు. అయితే ఆ ప్రాంతంలో మృతదేహం కనిపించలేదు. నీటి అలల తాకిడికి మరో చోటుకు కొట్టుకుపోయింది. దీంతో పోలీసులు పలు చోట్ల గాలించి వెనుతిరిగి వచ్చేశారు. రిజర్వాయర్లో మృతదేహం ఉందని తేలడంతో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లేందుకు భయాందోళన చెందుతున్నారు.