సీఎం, పీఎంలు కలిసి పనిచేయాలి

19 Oct, 2015 00:53 IST|Sakshi

కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు
 
 సాక్షి, హన్మకొండ: పార్టీలు వేరైనా దేశాభివృద్ధి లక్ష్యంగా ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు కలిసి పని చేయాలని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. హెరిటేజ్ సిటీ డెవలప్‌మెంట్ అగ్యుమెంటేషన్ యోజనా (హృదయ్) పథకాన్ని  ఆదివారం వరంగల్ నగరంలో ఆయన ప్రారంభించారు. ఈ పథకం ద్వారా రూ 40 కోట్ల వ్యయంతో నగరంలో ఖిలావరంగల్, వేయిస్తంభాలగుడి, పద్మాక్షి ఆలయం, దర్గా కాజీపేట, భద్రకాళి చెరువులను అభివృద్ధి చేయనున్నారు. తొలిదశలో రూ. 14.9 కోట్ల వ్యయంతో భద్రకాళీ ఫోర్ షోర్‌బండ్ అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా వేయి స్తంభాలగుడిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశాభివృద్ధికోసం సీఎం, పీఎంలు కలిసి పని చేయాలన్నారు.

2022 నాటికి అందరికీ ఇళ్లు నిర్మించి ఇవ్వాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందన్నారు. ఒక పడకగది ఇళ్లు నిర్మిస్తామని  ప్రకటిస్తే, దానికి అదనంగా తాము మరోగదిని జత చేసి డబుల్‌బెడ్ ఇళ్లు ఇస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారని, ఇందుకు ఆయనను అభినందిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో నగరాలలో జరిగే అభివృద్ధి పథకాలన్నీ ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలోనే ఉంటాయని సూచనప్రాయంగా వెల్లడించారు.

అందరికీ ఇళ్లు పథకం కింద రాష్ట్రంలో 34 పట్టణాలు ఎంపిక చేసినట్లు తెలిపారు. అమృత్ పథకం ద్వారా రాష్ట్రంలో 13 పట్టణాలలో మౌలిక సదుపాయాలు మెరుగుపరుస్తున్నట్లు చెప్పారు.  ప్రధాన్‌మంత్రి జన్‌ధన్‌యోజన కింద 18 కోట్ల మంది బ్యాంకు ఖాతాలు ప్రారంభించినట్లు చెప్పారు. అంతకుముందు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ వరంగల్ నగర అభివృద్ధికి హృదయ్ పథకం రెండోదశ ద్వారా అదనంగా రూ. 200 కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు