గుర్తుతెలియని యువకుడి హత్య

16 Sep, 2016 22:48 IST|Sakshi
మొండెం నుంచి తలను వేరుచేసి పడేసిన దృశ్యం
– తల, మొండెం వేర్వేరు చోట్ల పడేసిన దుండగులు
పీలేరు: గుర్తుతెలియని యువకుడిని గొంతుకోసి హత్య చేసి తల, మొండెం వేర్వేరు చోట్ల పడేసిన సంఘటన పీలేరు–తిరుపతి మార్గంలోని టీఎన్‌ఆర్‌ కాంప్లెక్స్‌ వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. టీఎన్‌ఆర్‌ కాంప్లెక్స్‌ సమీపంలో ఒక యువకుడు హత్యకు గురైనట్టు వాకింగ్‌కు వెళ్లిన స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన పీలేరు సీఐ డి.నాగరాజు, ఎస్‌ఐ సుధాకర్‌రెడ్డి అక్కడికి చేరుకుని పరిశీలించారు. షిరిడీ సాయిబాబా ఆటో కన్సల్టెంట్‌ కార్యాలయ షెటర్‌ వద్ద రక్తపు మరకలు ఉండడంతో అక్కడ హత్య చేసి సమీపంలో మొండె పడేసినట్టు గుర్తించారు. దుండగులు తలను వేరుచేసి సమీపంలోని తిరుపతి–పీలేరు రహదారికి పక్కనున్న ముళ్లపొదల్లో పడేశారని పోలీసులు తెలిపారు. అక్కడున్న కత్తి, కర్చీప్‌లను స్వాధీనం చేసుకున్నారు. హత్యకు గురైన వ్యక్తి స్థానికుడు కాదని, అతను ఎవరనే విషయం విచారణలో తేలాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు. పాత కక్షలతో చంపారా? లేక వివాహేతర సంబంధంతో హత్య చేశారా కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పీలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. 
మరిన్ని వార్తలు