పాములపాడు: ఎస్ఆర్ఎంసీ కాలువ సమీపంలో గుర్తుతెలియని మహిళ మృతదేహం శనివారం లభ్యమైంది. సమాచారం అందుకున్న ఆత్మకూరు సీఐ దివాకరరెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని పరిసరాలను పరిశీలించారు. మతురాలి వయస్సు 25 –30 సంవత్సరాల మధ్య ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. కాళ్లకు మెట్టెలు, మెడలో పుస్తెలు వంటివి లేకపోవడంతో ఆవివాహిత లేదా వితంతువు అయి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. మహిళ మెడకు చీర చుట్టి ఉండటంతో హత్య చేసినట్లు తెలుస్తోంది. ఆరంజ్ రంగు చీర,Sచమ్కీలతో కూడిన ఆరంజ్ రంగు జాకెట్ ధరించింది. పరిసర ప్రాంతంలో గాజులు పగిలి ఉండటం, చెప్పులు ఉండటంతో ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది. మృతురాలి కుడిచేతికి చిన్న సాయిబాబా బొమ్మ ఉన్న దారం ఉంది. మృతదేహాన్ని ఎస్ఆర్ఎంసీ కాలువలో పడేసే ప్రయత్నంలో ముళ్ల పొదలు అడ్డురావడంతో దుండగులు అక్కడే వేసినట్లు తెలుస్తోంది. శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. మతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పాములపాడు వీఆర్వో ఉశేన్ సాహెబ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని, విచారణ జరుపుతున్నట్లు సీఐ తెలిపారు.