– రెవెన్యూ డివిజన్ కేంద్రంగా డోన్
–కసరత్తు చేస్తున్న ప్రభుత్వం
కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు నగరపాలక సంస్థ సహా మున్సిపాలిటీ కేంద్రాలను అర్బన్ మండలాలుగా గుర్తించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అదే విధంగా జిల్లాలో ఒక రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ముందుగా కర్నూలు నగరాన్ని అర్బన్ మండలంగా గుర్తించనున్నట్లు సమాచారం. నగరంలో 5 లక్షలకు పైగా జనాభా ఉండటంతో అర్బన్ మండలంగా గుర్తించాలనే ప్రతిపాదన కొన్నేళ్లుగా ఉంది. ఎట్టకేలకు ఇది కార్యరూపం దాల్చే అవకాశం ఏర్పడింది. కర్నూలును అర్బన్ మండలంగా గుర్తించిన తర్వాత నంద్యాల, ఆదోని మున్సిపాలిటీలను కూడా అర్బన్ మండలాలుగా గుర్తించనున్నారు. ఆ తర్వాత డోన్, ఎమ్మిగనూరు, నందికొట్కూరు, బనగానపల్లెలను ఆర్బన్ మండలాలుగా గుర్తించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలో ఇప్పటి వరకు అర్బన్ మండలాలు లేకపోవడం గమనార్హం.