సాక్షి ప్రతినిధి, తిరుపతి: టీటీడీ ఆధ్వర్యం లో వరుణయాగం, సరస్వతీయాగం నిర్వహించేందుకు పండితుల సలహా తీసుకుని కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని టీటీడీ ఈవో సాంబశివరావు.. హిందూ ధర్మ ప్రచారపరిషత్ అధికారులను ఆదేశించారు. తిరుపతిలో సోమవారం ఉన్నత అధికారులతో ఈవో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీటీడీ అనుబంధ ఆలయాల్లో వేసవిలో భక్తులు ఇబ్బంది పడకుండా అవసరమైన ప్రాంతాల్లో చలువ పందిళ్లు తదితర ఏర్పాట్లు చేయాలన్నారు.
తిరుమల ఘాట్రోడ్డు, అటవీ ప్రాంతాల్లో ఎటువంటి ప్రమాదాలు సంభవించినా భక్తులు వెంటనే కాల్ సెంటర్, టోల్ఫ్రీ నెంబర్కు ఫోన్చేసి తెలియజేయాలని కోరుతూ విజ్ఞప్తి బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. సమీక్ష సమావేశంలో టీటీడీ తిరుపతి జేఈవో పోలభాస్కర్, ప్రాజెక్టుల ప్రత్యేకాధికారి ఎన్.ముక్తేశ్వరరావు, చీఫ్ ఇంజనీర్ చంద్రశేఖర్రెడ్డి అధికారులు పాల్గొన్నారు.