ప్రతి పాటా ప్రేక్షకుల హృదయాన్ని తాకాలి

29 Jan, 2017 23:03 IST|Sakshi
ప్రతి పాటా ప్రేక్షకుల హృదయాన్ని తాకాలి
  • సినీ గేయ రచయిత సిరివెన్నెల
  • తుని రూరల్‌ (తుని) : 
    ప్రతి పాటా ప్రేక్షకుల హృదయాలను తాకాలన్న సంకల్పమే తనకు గుర్తింపునిచ్చిందని సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అన్నారు. వేటూరి సాహితీ పీఠం, శ్రీప్రకాష్‌ కల్చరల్‌ అసోసియేషన్లు సంయుక్తంగా వేటూరి కవితా సప్తమ సాహితీ పురస్కారాన్ని ఆయనకు ప్రదానం చేశారు. వేటూరి 81వ జయంతి సందర్భంగా తుని చిట్టూరి మెట్రో ఫంక్ష¯ŒS హాలులో ఆదివారం రాత్రి ఈ కార్యక్రమం జరిగింది. సీతారామశాస్త్రి మాట్లాడుతూ, వ్యక్తికంటే వ్యక్తిత్వం గొప్పదన్నారు. మానవతా విలువలతో రచనలు పరిపూర్ణంగా ఉండాలని, సాహితీవేత్తకు సామాజిక బాధ్యత ముఖ్యమన్నారు. కాకినాడలో సినిమా చూస్తుండగా ‘అది మన ఊరి కోకిలమ్మ, నిన్నడిగింది కుశలమమ్మ, గట్టుమీద గోదారమ్మ, రెల్లిపూలవలే గంతులేస్తుంటే’ అనే పాట వేటూరిపై అభిమానాన్ని పెంచిందన్నారు. ఆ రోజే పాటలు రాసేందుకు ధైర్యం వచ్చిందన్నారు. తన తండ్రి వయస్సే కావడంతో వేటూరిని తండ్రిగా భావిస్తున్నట్టు తెలిపారు. అంతకుముందు పీఠం వ్యవస్థాపక అధ్యక్షుడు చక్కా సూర్యనారాయణ, అధ్యక్షుడు సీహెచ్‌వీకే నరసింహారావు, వ్యవస్థాపక కార్యదర్శి కలగ రామజోగేశ్వరశర్మ, ముఖ్య అతిథి యనమల కృష్ణుడు, విజయ ప్రకాష్‌లు సిరివెన్నెల సీతారామశాస్త్రి దంపతులను ఘనంగా సన్మానించారు. వేటూరి సాహితీ పీఠం 81 పుస్తకాలను బహూకరించింది. ముఖ్యవక్తలు పలువురు సిరివెన్నెల రచనలు, పాటల్లో భావాలను విశదీకరించారు. వేటూరి, సిరివెన్నెల సుమధుర గీతాల సంగీత విభావరి నిర్వహించారు. 
     
మరిన్ని వార్తలు