విజిలెన్స్‌ అధికారుల దాడి

7 Feb, 2017 22:38 IST|Sakshi
విజిలెన్స్‌ అధికారుల దాడి
- 123.60 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం స్వాధీనం
- ప్రముఖ వ్యాపారి హస్తం ఉన్నట్లు సమాచారం
   
కర్నూలు (అగ్రికల్చర్‌): డీలర్ల నుంచి అక్రమంగా కొనుగోలు చేసిన రేషన్‌ బియ్యాన్ని వ్యాపారి బ్లాక్‌ మార్కెట్‌కు తరలించేందుకు సిద్ధం చేస్తుండగా మంగళవారం విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. కర్నూలు నుంచి ప్రతినెల వందలాది క్వింటాళ్ల రేషన్‌ బియ్యం గుట్టుచప్పుడు కాకుండా జిల్లా సరిహద్దులు దాటిపోతున్నాయి. విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంటు అధికారి బాబురావు ఆదేశాల మేరకు కల్లూరు శ్రీనివాసనగర్‌లోని జంగాల కొట్టాల దగ్గర ఉన్న రేకుల షెడ్‌ను తనిఖీ చేశారు.
 
అందులో బ్లాక్‌మార్కెట్‌కు తరలించేందుకు సిద్ధం చేసిన 300 బస్తాల బియ్యాన్ని ప్రత్యేక తహసీల్దారు రామకృష్ణారెడ్డి,  విజిలెన్స్‌ ఎన్స్‌ఫోర్‌మెంట్‌ సీఐ శ్రీనివాసరెడ్డి, ఎస్‌ఐ సుబ్బరాయుడు, విజిలెన్స్‌ కానిస్టేబుళ్లు శేఖర్‌బాబు, ఈశ్వరరెడ్డి, మునిస్వామి స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన 123.60 క్వింటాళ్ల బియ్యం విలువ రూ.3 లక్షలు ఉంటుందని విజిలెన్స్‌ తహసీల్దారు తెలిపారు. ప్రజాపంపిణీలో జరుగుతున్న అక్రమాలను అదుపు చేసేందుకు ఈ–పాస్‌ యంత్రాలు ఉన్నా అక్రమాలకు అడ్డకట్ట పడటం లేదు. ప్రతి నెల డీలర్లు 10 నుంచి 25 క్వింటాళ్ల వరకు బ్లాక్‌ మార్కెట్‌కు తరలిస్తునే ఉన్నట్లు విమర్శలు ఉన్నాయి.  
 
బియ్యం వ్యాపారీ చరణ్‌ సూత్రధారి:
విజిలెన్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్న బియ్యం ప్రముఖ బియ్యం వ్యాపారి చరణ్‌కు చెందినవిగా విజిలెన్స్‌ అధికారులు భావిస్తున్నారు. విజిలెన్స్‌ అధికారులు దాడికి వెళ్లినపుడు షెడ్‌ వద్ద కాపలాగా ఎరుకలి వీరన్న అనే వ్యక్తి ఉన్నారు. బియ్యం గురించి వీరన్నను ప్రశ్నించగా చరణ్‌ అనే వ్యాపారికి చెందిన ఈ బియ్యానికి కాపలాగా ఉన్నట్లు తెలిపారు. చరణ్‌ చెప్పిన వారికి డబ్బులు చెల్లిసు​‍్తంటానని పేర్కొన్నారు. డీలర్ల నుంచి చరణ్‌ బియ్యం కొనుగోలు చేసి స్థానికంగా ఉండే రైస్‌ మిల్లులకు తరలిస్తున్నట్లు అధికారుల విచారణలో తేలింది. అంతేగాక బళ్లారి, ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తుంటాడని సమాచారం. కర్నూలు నగరంలోనే డీలర్ల నుంచి ప్రతి నెల దాదాపు 2500 క్వింటాళ్ల బియ్యం కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం.
 
కర్నూలు డీలర్లతో పాటు గ్రామీణ ప్రాంత డీలర్ల నుంచి రేషన్‌ బియ్యం కొనుగోలు చేసి రైస్‌ మిల్లులకు, ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. స్వాధీనం చేసుకున్న బియ్యంపై విజిలెన్స్‌ అధికారులు కల్లూరు తహసీల్దారు, రెవెన్యూ ఇన్స్‌పెక్టర్‌లతో పంచానామా చేయించారు. అనంతరం ఒక లారీ ద్వారా ఏ క్యాంపులోని సివిల్‌ సప్లయ్‌ స్టాక్‌ పాయింట్‌కు తరలించారు.  వ్యాపారి చరణ్, ఎరుకలి వీరన్నపై  కేసు నమోదు చేసి జేసీ కోర్టుకు పంపుతున్నట్లుగా విజిలెన్స్‌ ప్రత్యేక తహసీల్దారు రామకృష్ణారెడ్డి తెలిపారు.     
 
మరిన్ని వార్తలు